logo

జిల్లాకు పాలమూరు.. రంగారెడ్డి సాగు నీరు

వికారాబాద్‌ జిల్లా రైతుల భూములకు వంద శాతం సాగునీటిని అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కంది రైతుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 01 Feb 2023 01:15 IST

కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పెద్ద పంపుల ఏర్పాటు
మంత్రి నిరంజన్‌ రెడ్డి

మాట్లాడుతున్న వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: వికారాబాద్‌ జిల్లా రైతుల భూములకు వంద శాతం సాగునీటిని అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కంది రైతుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండూరు కందిపప్పునకు లభించిన భౌగోళిక గుర్తింపు ధ్రువపత్రాన్ని యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఉద్దండాపూర్‌ నిర్మాణం పూర్తి కాగానే..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఉద్దండాపూరు నిర్మాణం పూర్తి కాగానే జిల్లాకు సాగునీటిని అందించే ప్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే మోటార్ల కంటే ఈ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన ఒక్కో విద్యుత్తు మోటారు సామర్థ్యం 1.95 లక్షల అశ్విక శక్తితో కూడినదన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, జీఐ ట్యాగ్‌ సహాయ రిజిస్ట్రార్‌ హబీబుల్లా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జీఐ సాధించిన మొదటి వ్యవసాయ ఉత్పత్తి తాండూరు కందిపప్పు అన్నారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజుగౌడ్‌, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, యాలాల, బషీరాబాద్‌ ఎంపీపీలు బాలేశ్వర్‌గుప్త, కరుణ, రైతు సంఘం అధ్యక్షుడు నర్సిములు, యాలాల సహకార సంఘం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో నిమిషం పాటు మంత్రి చప్పట్లు కొట్టించారు. జై తాండూరు కంది పప్పు, జై తెలంగాణ, జై భారత్‌ అనగానే రైతులు మరోసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం

తాండూరు గ్రామీణ: జిల్లాలో అద్భుతమైన నల్ల, ఎర్ర నేలలు ఉన్నాయని, వాటితో అధికారులు ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులను ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాండూరు మండలం అంతారంలో రూ.23లక్షలతో నిర్మించిన రైతు వేదికను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. వేదిక ముందర కృత్రిమ ఎద్దుల బండిని నిర్మించడంపై సర్పంచి రాములును అభినందించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘాధ్యక్షులు నరేందర్‌రెడ్డి, భారాస కన్వీనర్‌ శకుంతల తదితరులున్నారు.  

రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం

యాలాల: రైతును రాజును చేయడమే సీఎం కేసిఆర్‌ లక్ష్యం అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దౌలాపూర్‌ సమీపంలో యాలాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.2.5కోట్లతో నిర్మిస్తున్న రైస్‌మిల్‌, గోదాంకు సహకార సంఘం ఛైర్మన్‌ సురేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సర్పంచ్‌ లక్ష్మి, మండల ఉపాధ్యక్షులు రమేష్‌, భారాస మండల పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని