logo

కొత్త కలెక్టర్‌గా నారాయణరెడ్డి

జిల్లా కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన 2019 డిసెంబరు 24 నుంచి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.

Published : 01 Feb 2023 01:15 IST

ఉపాధ్యాయుడిగా మొదలై.. ఒక్కోమెట్టు అధిగమించి..

న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లా కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన 2019 డిసెంబరు 24 నుంచి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. వికారాబాద్‌ ప్రస్తుత కలెక్టర్‌గా 2021 సెప్టెంబరు 2 నుంచి విధులు నిర్వహించిన నిఖిలను బదిలీ చేశారు.  

పట్టు వీడక.. కష్టానికి వెరవక..

ఉన్నత ఉద్యోగం సాధించాలని యువత కలలు కంటారు. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా అధిగమించి ఆ కలలను సాకారం చేసుకునేవారు కొందరే. ఆ కోవలోకే నారాయణరెడ్డి వస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. చివరి సంతానం నారాయణరెడ్డి. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఏడో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి మృతి చెందారు. దీంతో కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువు మానేసి పొలం బాట పట్టారు. చదువుపై ఉన్న మక్కువతో ఓ వైపు పని చేస్తూనే మరోవైపు చదువుకున్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో కళాశాలలో ఉచిత ప్రవేశం పొందారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పని చేస్తూనే ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించారు. డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీ, ఎంఎస్‌స్సీ పూర్తి చేశారు. 2006 డీఎస్సీలో మహబూబ్‌నగర్‌ జిల్లా టాపర్‌గా నిలిచారు. పోస్టింగ్‌ ఇవ్వడం రెండేళ్లు ఆలస్యం కావడంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో రూ.2,500 వేతనంపై ఉపాధ్యాయుడిగా పని చేశారు. 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. తను చదివిన బడిలోనే విధులు నిర్వహించారు.

తొలి ప్రయత్నంలోనే ఆర్డీఓ

సొంత ఊరే అయినా ఓ చిన్న గది అద్దెకు తీసుకొని గ్రూప్‌-1 సాధించాలన్న లక్ష్యంతో చదువుకోవడం ప్రారంభించారు. బడిలో పాఠాలు బోధించడం, గదికి వెళ్లి చదువుకోవడం ఇదే జీవితంగా మారింది. శ్రమ ఫలించి 2009లో గ్రూప్‌-1లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి తొలి ప్రయత్నంలోనే ఆర్డీఓగా ఎంపికయ్యారు. 2011లో గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేటల్లో విధులు నిర్వహించారు. జిల్లా విభజన నేపథ్యంలో నల్గొండ జిల్లా సంయుక్త పాలనాధికారిగా పనిచేశారు. అనంతరం ములుగు, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వికారాబాద్‌కు విచ్చేస్తునారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని