logo

నేర వార్తలు

విద్యుత్తు బిల్లు కట్టలేదని.. కనెక్షన్‌ తొలగిస్తామని వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని నమ్మి ఓ మహిళ.. రూ.76 వేలు పోగొట్టుకుంది. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధి గోకుల్‌ నగర్‌లో ఉంటున్న మహిళ (50) చరవాణికి సోమవారం ఓ సందేశం వచ్చింది.

Published : 01 Feb 2023 01:59 IST

విద్యుత్తు బిల్లు చెల్లించాలని సంక్షిప్త సమాచారం
యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే రూ.76 వేలు మాయం

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లు కట్టలేదని.. కనెక్షన్‌ తొలగిస్తామని వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని నమ్మి ఓ మహిళ.. రూ.76 వేలు పోగొట్టుకుంది. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధి గోకుల్‌ నగర్‌లో ఉంటున్న మహిళ (50) చరవాణికి సోమవారం ఓ సందేశం వచ్చింది. సకాలంలో విద్యుత్తు బిల్లు చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తామని అందులో ఉంది. అందులో ఉన్న నంబరుకు ఫోన్‌ చేయగా.. ఓ వ్యక్తి  మాట్లాడారు. బిల్లు చెల్లించేందుకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. మొదటగా యాప్‌లో రూ.10 చెల్లించాలని చెప్పగా, అలాగే చేసింది. అనంతరం ఆమె బ్యాంక్‌ ఖాతాలో నుంచి రూ.76,400 డ్రా అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఆ ముగ్గురూ దొరికారు..!

శామీర్‌పేట, న్యూస్‌టుడే: నగర శివారు ఉద్దెమర్రిలో తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీ చేసిన ఘటనలో పోలీసులు ముగ్గుర్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఈ ముగ్గురు పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు తేల్చారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలోని మద్యం దుకాణం దగ్గర గత నెల 23 అర్ధరాత్రి వేళ దోపిడీ జరిగింది. దుకాణంలో పనిచేసే ఇద్దరూ రాత్రి 10 గంటలకు షట్టర్‌ మూసేసి రోజువారీగా వచ్చే కలెక్షన్‌ డబ్బుతో బయటకి రాగానే ముగ్గురు నిందితులు నంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై వచ్చారు. డబ్బు ఇవ్వాలంటూ దాడి చేశారు. సిబ్బంది ఎదురుతిరగడంతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి రూ.2.08 లక్షలు దోపిడీ చేసి పరారయ్యారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ఇతర వివరాల ఆధారంగా దాదాపు ఏడు రోజుల తర్వాత నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.


రసాయనాల డ్రమ్ము పేలి కార్మికుడి దుర్మరణం

జీడిమెట్ల(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: ఓ ప్లాస్టిక్‌ గోదాం యజమాని నిర్లక్ష్యానికి  నిండు ప్రాణం గాల్లో కలిసింది. జీడిమెట్ల పారిశ్రామికవాడ చెంత గంపల బస్తీలో ముషీరాబాద్‌కి చెందిన మహమ్మద్‌ మక్బుద్‌ కొన్నేళ్లుగా ప్లాస్టిక్‌ రీసైకిల్‌ గోదాం నిర్వహిస్తున్నాడు. అందులో ఉత్తరప్రదేశ్‌ ఫైజాబాద్‌కి చెందిన విజయ్‌ప్రజాపత్‌(35), రమేశ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం యంత్రంపై రసాయనాల డ్రమ్మును కట్‌ చేస్తుండగా ఒత్తిడితో ఒక్కసారిగా పేలింది. ప్రమాదంలో విజయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు 108కి సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ్‌ మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు. దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని జీడిమెట్ల ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఎం.పవన్‌, ఎస్సై సతీష్‌రెడ్డి, పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


ఇన్‌స్టాలో పరిచయం.. నగరానికి రప్పించి మోసం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన దిల్లీకి చెందిన మహిళను నగరానికి రప్పించి, ఏకాంతంగా గడిపి, తెల్లారేసరికి అదృశ్యమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఫయాజుద్దీన్‌ ఆఫ్రిదికి కొద్ది రోజుల కిందట దిల్లీకి చెందిన నృత్యకారిణి(29) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ఆమె భర్తకు దూరంగా ఏడేళ్ల కుమారుడితో ఉంటోంది. ఇద్దరి మధ్య మాటలు కలవడంతో కలిసేందుకు నగరానికి రావాలంటూ కోరాడు. అందుకోసం విమాన టిక్కెట్లు సమకూర్చాడు. మూడు రోజుల కిందట ఆమె నగరానికి రాగా.. ఇద్దరూ కలిసి బంజారాహిల్స్‌లోని ఓయో గదిలో గడిపారు. మరునాడు ఉదయం ఆమె నిద్ర లేచి చూడగా ఆఫ్రిది కనిపించలేదు. చరవాణిలో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి, మోసం చేసి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఓయోలో అతడు ఇచ్చిన ఆధార్‌ కార్డు ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


లిఫ్టులోకి చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసు గుంజుకున్నాడు

బాధితురాలు స్వర్ణలత

నిజాంపేట, న్యూస్‌టుడే: ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. బాచుపల్లి పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. నిజాంపేట శ్రీనివాసకాలనీలోని సిరిబాలాజీ రెసిడెన్సీలో పోలవరపు స్వర్ణలత(62) తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. మధురానగర్‌లోని సాయిబాబా ఆలయానికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. మధ్యాహ్నం ఆలయాన్ని మూసే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. ‘పరిసరాల్లో ఎక్కడైనా అద్దె ఇల్లు ఖాళీగా ఉందా అమ్మా?’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. స్వర్ణలత తనకు తెలియదని సమాధానమిచ్చి, నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా.. మాట్లాడుతూ ఆమె వెంట వెళ్లాడు. ఇంతలో తన అపార్ట్‌మెంట్‌ రావడంతో ఆమె లిఫ్టు ఎక్కారు. తలుపు వేయబోతున్న సమయంలో ఆ వ్యక్తి బలవంతంగా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. అందుకు వృద్ధురాలు అడ్డుకుని, గట్టిగా అరిచేలోపే ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసుకుని తెంపుకొని అక్కడి నుంచి మెరుపు వేగంతో పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి సీఐ కె.నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకకరించారు. ఆగంతకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.


గుండెపోటుతో బీటెక్‌ విద్యార్థి మృతి

గౌరవ్‌కుమార్‌

చైతన్యపురి, న్యూస్‌టుడే: గుండెపోటుతో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి న్యూనాగోలు వద్ద నెమ్మదించి పడిపోయాడు. అతడు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన స్థానికులు నీరు తాగించడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 108కి ఫోన్‌ చేస్తే అందుబాటులో లేకపోవడంతో ఆటోలో నాగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. అతడి వద్ద గుర్తింపు కార్డు ఆధారంగా రాంగిర్వార్‌ గౌరవ్‌కుమార్‌, నాగోలు ఇందూఅరణ్య సమీపంలోని శ్రేయాస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నట్లు గుర్తించారు. ఆర్కేపురం వాసి అని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని