logo

హైబ్రిడ్‌ కార్లకు గిరాకీ

రాజధాని వాసులు హైబ్రిడ్‌ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తుతోపాటు పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లకు నాలుగైదు నెలల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ ఏర్పడింది.

Published : 01 Feb 2023 02:34 IST

పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలపై ఏ మూలనో అనుమానం

రాజధాని వాసులు హైబ్రిడ్‌ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తుతోపాటు పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లకు నాలుగైదు నెలల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల కార్ల డీలర్లు, షోరూంలలో హైబ్రిడ్‌ కారు కొనాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యువకులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అచ్చంగా విద్యుత్తు కార్లనే కొంటుండగా మధ్య వయసు వారు, స్థిరాస్తి వ్యాపారుల్లో కొందరికి పూర్తిగా విద్యుత్తు బ్యాటరీలతో నడిచే కార్లపై ఏమూలో అనుమానం ఉండడంతో వీరంతా హైబ్రిడ్‌ కార్లను కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

నగరంలో అనుకూలం.. జాతీయ   రహదారులపై సురక్షితం : విద్యుత్తుతోపాటు పెట్రోల్‌ డీజిల్‌తోపాటు నడిచే హైబ్రిడ్‌ కార్లు నగర పరిస్థితులకు అనుకూలంగా ఉండడం, జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించవచ్చన్న భావనతోనే ఎక్కువమంది వీటిని కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కొందరు ఆటోమొబైల్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడా రద్దీ సమయాల్లో ఎక్కడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లలేమని, హైబ్రిడ్‌ కార్ల తయారీలో ప్రత్యేకతల దృష్ట్యా గంటకు అరవై కిలోమీటర్లు, ఆలోపు వేగంతో వెళ్లినప్పుడు విద్యుత్తు బ్యాటరీతో నడుస్తుందని, జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లడంతో దానంతటదే పెట్రోల్‌ లేదా డీజిల్‌ను ఇంధనంగా మార్చుకుంటుందని వివరిస్తున్నారు. నగరంలో రద్దీ ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు బ్రేకులు వేయడం, పెట్రోల్‌ లేదా డీజిల్‌ను కార్లు ఎక్కువగా వినియోగిస్తాయని, విద్యుత్తు బ్యాటరీతో ప్రయాణిస్తే ఇంధనం ఆదాతో పాటు కాలుష్యం వెదజల్లబోదు.


రెండు, మూడు నెలల నిరీక్షణ..

ప్రముఖ కంపెనీల హైబ్రిడ్‌ కార్లకు గిరాకీ పెరుగుతుండడంతో కొనుగోలుదారులకు వెంటనే లభించడం లేదు. నగదు చెల్లించినా రెండు, మూడు నెలల తర్వాతే షోరూం నిర్వాహకులు డెలివరీ ఇస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి హైబ్రిడ్‌ కార్ల కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరంలోని షోరూంలలో ప్రముఖ కంపెనీల కార్లు కొనేందుకు చాలామంది వస్తుండడంతో నిర్వాహకులు వారి వద్ద నుంచి బయానా మాత్రమే తీసుకుంటున్నారు. హైబ్రిడ్‌ కార్లపై సామాజిక మాధ్యమాలు, టీవీలు, ప్రత్యేక ప్రదర్శనల్లో వివరిస్తుండడంతో ధర ఎక్కువైనా సరే కొనేందుకు ముందుకు వస్తున్నారు. వీటికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా.. వేర్వేరు కంపెనీలు రూ.7.80లక్షల నుంచి రూ.20.59లక్షల(ఎక్స్‌ షోరూం ధర) వరకు పలు వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని