logo

వక్ఫ్‌ భూములు.. ఉఫ్‌

నగర శివారులోని రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములను రౌడీషీటర్లు, పహిల్వాన్లు, కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమించారు. ఆపైన ఈ స్థలాలను విక్రయించి రూ.కోట్లలో దండుకుంటున్నారు.

Published : 01 Feb 2023 03:04 IST

రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాలపై గద్దల్లా వాలిన రౌడీషీటర్లు
బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో కబ్జా బాగోతం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి -పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే

బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో బండరాళ్లు తొలగించి చేపడుతున్న నిర్మాణాలు

నగర శివారులోని రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములను రౌడీషీటర్లు, పహిల్వాన్లు, కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమించారు. ఆపైన ఈ స్థలాలను విక్రయించి రూ.కోట్లలో దండుకుంటున్నారు. ఈ కబ్జా బాగోతం తెలిసినా రెవెన్యూ, పోలీసు, వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. అమాయకులు ప్లాట్లు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. చారిత్రక పహాడీషరీఫ్‌ దర్గా పరిసరాల్లో ఈ తతంగం జరుగుతోంది.

డంగ్‌పేట కార్పొరేషన్‌ మామిడిపల్లి, పహాడీషరీఫ్‌ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్‌ 99/1లో 55 ఎకరాలు, సర్వే నంబర్‌ 96లో 35 ఎకరాల భూమి వక్ఫ్‌ బోర్డు అధీనంలో ఉంది. స్థల పరిరక్షణకు వారు చర్యలు తీసుకోకపోవడంతో పాతబస్తీకి చెందిన కొంతమంది రౌడీషీటర్లు, పహిల్వాన్ల కన్ను పడింది. వీరికి కొంతమంది రాజకీయ నాయకుల తోడ్పాటు లభించింది. దీంతో ఒక్కో రౌడీషీటరు, పహిల్వాన్‌ మూడు నుంచి అయిదు ఎకరాల వరకు అధీనంలోకి తీసుకున్నారు. స్థానిక సంస్థలకు చెందిన కొంతమంది తాజా, మాజీ ప్రతినిధులు కూడా రెండు ఎకరాల నుంచి ఆపైన భూమిని తమపరం చేసుకున్నారు. ఆక్రమించిన భూమిని ప్లాట్లు చేసి గజం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. స్థలం రిజిస్ట్రేషన్‌ జరగనందున ఇద్దరి మధ్య ఒప్పందం మేరకే ఈ కొనుగోళ్లన్నీ పూర్తవుతున్నాయి. ఈ భూమిలో కొన్ని కొండలు కూడా ఉన్నాయి. రాత్రిపూట వీటిని పగలగొట్టి ఇంటి స్థలంగా మార్చి అమ్మకాలు చేపడుతున్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌ అధికారులు ఈ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కిందిస్థాయి అధికారులకు అమ్యామ్యాలు అందడంతో డోరు నంబర్లు, విద్యుత్తు, నీటి కనెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు.

* అంతా రౌడీషీటర్లకేనా మేమూ ఉన్నామంటూ ఓ మాజీ సర్పంచి ఏకంగా అయిదు ఎకరాలు ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి పేరుతో అధికారులను సంబంధిత మాజీ సర్పంచి హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు.

రౌడీషీటర్‌ పేరుతో కాలనీ

ఓ రౌడీషీటర్‌ 12 ఎకరాలు ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయించాడు. కొనుగోలు చేసిన వారు ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలనీకి రౌడీషీటరు తన పేరే పెట్టాడు. వక్ఫ్‌ స్థలంలో ఇదేం ఆక్రమణ అని అడిగితే సంబంధిత రౌడీషీటరు ఓ ఎస్సైతో కల్సి ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నాడు.


ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం..
- జనార్దనరావు, తహసీల్దారు, బాలాపూర్‌

99/1, 96 సర్వే నంబరులో భూములు వక్ఫ్‌బోర్డుకు సంబంధించినవి. సిబ్బందిని పంపించి పరిశీలన చేస్తాం. ఆక్రమణలు ఉంటే స్వాధీనం చేసుకుంటాం. ఎన్ని ఆక్రమణలైనా గుర్తించి వక్ఫ్‌ స్థలాలను కాపాడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు