KTR: మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు?: కేటీఆర్‌

భారత్‌లో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని.. మన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు ఆలోచన చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

Updated : 02 Feb 2023 13:11 IST

హైదరాబాద్: భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారని.. అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. వారి దృష్టంతా ఎన్నికలపైనే ఉంటుందన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదేనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

‘‘బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అప్పటికే అనేక రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయి. కానీ దేశ అభివృద్ధి కోసం కేటాయింపులు చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. మనదేశంలో 60 శాతం జనాభా యువతే. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. మన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంది. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు మనం ఆలోచన చేయడం లేదు? ఎవరో ఉద్యోగాలు సృష్టిస్తారని ఎదురుచూడటం ఎందుకు? మన దేశం నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన బ్రాండ్స్ ఎందుకు రావడం లేదు? ఆవిష్కరణలు చేస్తూ చిన్న చిన్న దేశాలు ముందుకు వెళ్తున్నాయి. సింగపూర్‌ మన హైదరాబాద్ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ ఇవాళ ఆర్థిక వ్యవస్థ విషయంలో వేగంగా ముందుకెళ్తుంది.

దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర గణనీయమైనది. దేశ జీడీపీలో 5 శాతం వాటా రాష్ట్రానిదే. తెలంగాణ 3ఐ (ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్ గ్రోత్) విధానంతో ముందుకెళ్తోంది. టీఎస్ ఐపాస్‌తో కంపెనీలకు ఆన్‌లైన్‌లోనే 15 రోజుల్లో అనుమతులిస్తున్నాం. 16వ రోజు అనుమతి రాకపోతే ఆటోమేటిగ్‌గా అనుమతి ఇచ్చినట్టే అవుతుంది. అమెజాన్‌కు చెందిన ప్రపంచంలోనే పెద్ద క్యాంపస్ హైదరాబాదులోనే ఉంది. గూగుల్, ఉబర్ లాంటి కంపెనీలు వాటి సెకండ్ క్యాంపస్‌లను అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకున్నాయి. ఇతర దేశాల మాదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే భారత్‌ నంబర్‌ వన్‌ దేశంగా ఎదుగుతుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని