logo

పావుగంట దాటితే.. రెండింతలు

ఆయనో ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ అధికారి. రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వస్తుండగా.. వారిని తీసుకురావడానికి పదో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు కారులో రాత్రి పదింటి సమయంలో వెళ్లారు.

Updated : 03 Feb 2023 07:40 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ‘నిలుపు’ దోపిడీ
వాహనదారులపై పార్కింగ్‌ సిబ్బంది దౌర్జన్యం!

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆయనో ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ అధికారి. రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వస్తుండగా.. వారిని తీసుకురావడానికి పదో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు కారులో రాత్రి పదింటి సమయంలో వెళ్లారు. లోపలికి వెళ్లేటప్పుడు సాధారణంగా పార్కింగ్‌ బూత్‌ దగ్గర రశీదు ఇస్తారు. రాత్రి కావడంతో అక్కడున్నవారు రశీదు ఇవ్వలేదు. తిరిగి తల్లిదండ్రులను తీసుకుని బూత్‌ దాటి ఇంటికి వెళ్లినప్పుడు కూడా అక్కడి వారు ఛార్జి కోసం అడగలేదు. ఆయన స్టేషన్‌ నుంచి కిలోమీటరు దాటి వెళ్లిన తరువాత వెనుక నుంచి దృఢకాయులైన నలుగురు ద్విచక్రవాహనాలపై వచ్చి ఆ అధికారి కారుకు అడ్డుగా వచ్చి దౌర్జన్యం చేయబోయారు. ఛార్జి ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఛార్జి కింద రూ.500 ఇస్తేనే కారు కదలనిచ్చేదంటూ హుకుం జారీచేశారు. తల్లిదండ్రుల ముందు గొడవ ఎందుకన్న ఉద్దేశంతో వారికి డబ్బులిచ్చి కదిలారు. ముందుగా రశీదు ఇచ్చి తరువాత ఛార్జి వసూలు చేస్తే ఇచ్చేవాడినిగానీ ఇలా దౌర్జన్యం చేయడం దారుణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కేంద్రంగా ప్రయాణికులపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. విమానాశ్రయంలో వసూలు చేసినట్లు కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంత ఛార్జీని ఇవ్వలేమంటే ప్రయాణికులను సిబ్బంది బెదిరిస్తున్న దాఖలాలున్నాయి. ఫిర్యాదు చేసినా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పది ప్లాట్‌ఫాంలున్నాయి. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాం సికింద్రాబాద్‌ వైపు, పదో నంబర్‌ ఫ్లాట్‌ఫాం బోయగూడ వైపు ఉంటాయి. రెండు వైపులా రెండు రకాల పార్కింగ్‌ వ్యవస్థలున్నాయి. ఒకటి ప్రీమియర్‌ పార్కింగ్‌, రెండోది సాధారణ పార్కింగ్‌.

ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు వాగ్వాదానికి దిగితే కొన్నిసార్లు దౌర్జన్యాలు కూడా జరుగుతున్నాయి. పార్కింగ్‌ రుసుములు తగ్గించాలని చాలామంది రైల్వే అధికారులను కోరారు. రేట్లు తగ్గిస్తే తమకు ఆదాయం తగ్గుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఒప్పుకోవడం లేదని ప్రయాణికుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రీమియర్‌ పార్కింగ్‌లో ఛార్జీలు అదిరిపోతున్నాయి. స్టేషన్‌లోకి వెళ్లిన కారు 8 నిమిషాల్లో తిరిగొస్తే ఛార్జీ చెల్లించనవసరం లేదు. 8 నిమిషాలు దాటి 15 నిమిషాలైతే రూ.100, మరో 15 నిమిషాలు అదనంగా ఉంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. తరువాత మరో 15 నిమిషాలుంటే రూ.500 ఛార్జి చెల్లించాల్సిందే. ఇలా ప్రతి 15 నిమిషాలకు రేటు పెరిగిపోతోంది. ఇలా రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది.

సాధారణ పార్కింగ్‌లోనూ రేట్లు అధికంగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనానికి మొదటి గంటకు రూ.20 తరువాత ప్రతి గంటకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. 24గంటలపాటు ఇక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేస్తే జీఎస్టీతో కలిపి రూ.566 వసూలు చేస్తున్నారు. కారుకు మొదటి గంటకు రూ.40 చొప్పున తరువాతి ప్రతి గంటకు రూ.40 చొప్పున 24గంటలకు జీఎస్టీతో కలిపి రూ.1132 వసూలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని