logo

గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలని స్నేహితుడి హతం

నగరంలో సంచలనం రేకెత్తించిన యువకుడి హత్య కేసును కుల్సుంపురా పోలీసులు చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Published : 04 Feb 2023 03:17 IST

జియాగూడ యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

వివరాలు వెల్లడిస్తున్న గోషామహల్‌ ఏసీపీ సతీష్‌ కుమార్‌, కుల్సుంపురా సీఐ టి.అశోక్‌కుమార్‌

జియాగూడ, న్యూస్‌టుడే: నగరంలో సంచలనం రేకెత్తించిన యువకుడి హత్య కేసును కుల్సుంపురా పోలీసులు చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. జనవరి 22న జియాగూడ బైపాస్‌లో సాయినాథ్‌ అనే యువకుడిపై ముగ్గురు అగంతకులు మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు. దీన్ని కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌డేవిస్‌ సారథ్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్‌ టి.అశోక్‌కుమార్‌, ఎస్సై ఎన్‌.శేఖర్‌తో కలసి గోషామహల్‌ ఏసీపీ ఆర్‌.సతీష్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. అంబర్‌పేట్‌ బతుకమ్మకుంటకు చెందిన జంగం సాయినాథ్‌(29), జియాగూడ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసి డి.ఆకాశ్‌(28) బాల్యస్నేహితులు. ప్రస్తుతం సాయినాథ్‌ రామంతాపూర్‌లో ఆక్వేరియం దుకాణం నిర్వహిస్తూ, గ్లాస్‌ కట్టర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. ఆకాశ్‌ సోదరుడితో కలిసి టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఆకాశ్‌కు జియాగూడవాసులు ఎం.సోను(26), ఏ.సాయికుమార్‌ యాదవ్‌ అలియాస్‌ టిల్లు(25) కూడా స్నేహితులు. నలుగురూ విందు, వినోదాల్లో పాల్గొనేవారు. గతేడాది ఆకాశ్‌ వ్యాపార నిమిత్తం సాయినాథ్‌కు 5శాతంవడ్డీకి రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించినా తరువాత పట్టించుకోలేదు. అడిగితే పరుష పదజాలంతో తిట్టేవాడు. అవమానకరంగా భావించిన ఆకాశ్‌ అతడి హత్యకు మరో ఇద్దరితో కలసి పథకం వేశాడు.

నేరాల చిత్రాలతో ప్రేరణ

నేరచిత్రాలను ఎక్కువగా వీక్షించే అభిరుచి ఉన్న ఆకాశ్‌కు గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఆలోచన ఉండేది. కేజీఎఫ్‌ సినిమాలో రాఖీభాయ్‌ మాదిరిగా ముఠా తయారు చేయాలని పథకం వేశాడు. జనం చూస్తుండగా హత్య చేస్తే గ్యాంగ్‌స్టర్‌ అని క్రేజ్‌ వస్తుందంటూ సోను, సాయికుమార్‌లనూ ఒప్పించాడు. పదునైన కత్తులు, ఇనుప పైప్‌రాడ్‌ ప్రత్యేకంగా తయారు చేయించారు. గత నెల 22న సాయినాథ్‌కు ఆకాశ్‌ ఫోన్‌ చేసి రమ్మన్నాడు. అతడు జియాగూడ బైపాస్‌ చేరగానే, ముగ్గురు కలిసి అందరూ చూస్తుండగానే కత్తులు, ఇనుప పైప్‌రాడ్‌లతో దాడిచేసి విచక్షణారహితంగా నరికేశారు. సాయినాథ్‌ రక్తపు మడుగులో కుప్పకూలడంతో నిందితులు మారణాయుధాలు అక్కడే పడేసి మూసీనదిలోకి దూకి పారిపోయారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అతడి స్నేహితులే హంతకులుగా నిర్ధారణకు వచ్చారు. హత్యానంతరం తప్పించుకొని తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వెండితెరపై కనిపించినట్టు నిజ జీవితంలో గ్యాంగ్‌స్టర్‌లు, డాన్‌లు కావాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని ఏసీపీ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని