logo

ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ.600 కోట్లు

నగర ప్రయాణికుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండోదశపై అయోమయం తొలగింది. 2024 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ చెప్పారు.

Published : 04 Feb 2023 03:17 IST

వచ్చే ఏడాది మార్చికి పనుల పూర్తి 

ఈనాడు,హైదరాబాద్‌: నగర ప్రయాణికుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండోదశపై అయోమయం తొలగింది. 2024 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ చెప్పారు. ఇందుకోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 600 కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్‌  అనంతరం... శుక్రవారం రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ద.మ. రైల్వేకు నిధుల కేటాయింపు గురించి జూమ్‌ మీటింగ్‌ ద్వారా వివరించారు. తర్వాత రైల్‌నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో  ప్రాజెక్టుల వారీగా నిధుల వివరాలను జీఎం వెల్లడించారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌నూ 2024లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం రూ. 82 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి, హైటెక్‌సిటీ, నాగులపల్లి రైల్వే స్టేషన్ల గురించి, యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రెండోదశ పొడిగింపుపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. 

ఎదురుచూపులు ఫలించే అవకాశం..

2012-13లో మంజూరైన ఎంఎంటీఎస్‌ రెండోదశ మొత్తం 95 కిలోమీటర్లు. అప్పటి అంచనా ప్రకారం వ్యయం రూ. 817 కోట్లు.  రాష్ట్ర ప్రభుత్వం 2 వాటాలు.. ద.మ. రైల్వే ఒక వాటా నిధులు సమకూర్చేందుకు ఒప్పందం జరిగింది.  ఇప్పుడు వ్యయం రూ. 1150 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.279 కోట్లే ఇచ్చిందని జీఎం తెలిపారు. రాష్ట్రం నుంచి నిధులు అందడం ఆలస్యమైనా.. ప్రజలకు చౌక ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించిందన్నారు. 

ఈ పనులు పూర్తయ్యాయి..

మల్కాజిగిరి - బొల్లారం మధ్య 14 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ విద్యుదీకరణ, తెల్లాపూర్‌ - రామచంద్రాపురం.. 6 కిలోమీటర్లు, మేడ్చల్‌ - బొల్లారం .. 14 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ వేయడం, మౌలాలి - ఘట్‌కేసర్‌..  12.2 కిలోమీటర్లు, ఫలక్‌నుమా - ఉందానగర్‌ మధ్య 13.5 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ వేయడం పూర్తయ్యిందని జీఎం పేర్కొన్నారు. సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య రెండో లైను వేయడం, విద్యుదీకరణ, మౌలాలి - మల్కాజిగిరి - సీతాఫల్‌మండి  రెండో లైను నిర్మాణం, విద్యుదీకరించడం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ పనులనూ వేగవంతం చేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలలో నగరానికి వచ్చి సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులు ప్రారంభించే సమయంలో... ఎంఎంటీఎస్‌ రెండోదశనూ పట్టాలెక్కిస్తారా అని విలేకరులు అడగగా.. అలాంటిదేమీ లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని