Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ముందుకు తీసుకొచ్చారు. ఏఏ తేదీల్లో చర్చలు జరగనున్నాయో సభలో సీఎం ప్రకటించారు.

Updated : 04 Feb 2023 12:25 IST

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. ఆ తర్వాత అన్ని పక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. 

దీనిలో భాగంగా శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చెప్పారు. 8వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుందని.. వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు కేసీఆర్‌ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని