logo

సీఎం కేసీఆర్‌ పథకాలు మంచివే.. అయినా పేదల ఇళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది: చాడ

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గూడు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ఆ ప్రభుత్వమే విస్మరించడంతో చట్టబద్ధంగా పోరాడాల్సి వస్తోందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 03:47 IST

పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కుంట్లూరులో ఇళ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగిన పేదలకు సంఘీభావం ప్రకటిస్తున్న సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు ముత్యాల యాదిరెడ్డి, అందోజు రవీంద్రచారి, పాలమాకుల జంగయ్య, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

పెద్దఅంబర్‌పేట్‌: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గూడు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ఆ ప్రభుత్వమే విస్మరించడంతో చట్టబద్ధంగా పోరాడాల్సి వస్తోందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దఅంబర్‌పేట్‌ కుంట్లూరు గ్రామం పాపాయ్‌గూడెంలోని 215 నుంచి 224 సర్వే నంబర్లలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో సీపీఐ భూపోరాటంలో భాగంగా 14 రోజులుగా వేలాదిమంది పేదలు గుడిసెలు వేసి మకాం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సీపీఐ ప్రారంభించిన భూపోరాట క్షేత్రాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పురపాలిక కౌన్సిలర్‌ పబ్బతి లక్ష్మణ్‌లతో కలిసి చాడ వెంకట్‌రెడ్డి సందర్శించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు మంచివేనని కితాబిచ్చారు. అయితే ఆయన జీవో 55 ప్రకారం అర్హులైన పేదలందరికీ 125 గజాల ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ బడ్జెట్‌ సమావేశంలోనే రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయాలన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి తమదేనంటూ ఆరోపిస్తున్న ప్రైవేటు వ్యక్తులు వెనక్కి వెళ్లాలని కోరారు. వాస్తవాలను పరిశీలించి సదరు జాగాలను భూదాన్‌ భూములుగా ధ్రువీకరించి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలన్నారు. 14 రోజులుగా అవస్థలు పడుతున్న పేదల కోసం స్వచ్ఛంద సంస్థల ద్వారా తాగునీరు తదితరాలు సమకూర్చేలా చొరవ తీసుకుంటామన్నారు. భూపట్టాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని, వీలైతే నేరుగా వాస్తవాలు వివరిస్తామని చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానాట్యమండలి కార్యదర్శి పల్లె నర్సింహ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని