logo

ఔటర్‌పై రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి

 కీసర వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..  ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 06 Feb 2023 03:57 IST

ఏడుగురికి గాయాలు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం

ఘటనాస్థలంలో నుజ్జయిన కార్లు

కీసర, న్యూస్‌టుడే:  కీసర వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..  ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కీసర ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి వివరాల ప్రకారం. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు డ్రైవర్స్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ జహంగీర్‌(45) నగరంలోని సూరారంలో జియో సంస్థలో డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబాన్ని నగరానికి తీసుకు రావాలనుకున్నాడు. ఇటీవల సుచిత్ర ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నాడు. భార్య సుల్తానా (43), కొడుకు నజీర్‌ (24)తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంటిని శుభ్రం చేశాడు. ఆదివారం తన పెళ్లిరోజు కావడంతో మోత్కూరుకు వెళ్లి అక్కడే వేడుక చేసుకొని.. సామగ్రి కూడా తీసుకురావాలనుకున్నాడు. జహంగీర్‌కు తాను పనిచేసే సంస్థలో సిబ్బంది మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన రాపోలు శ్రీనివాస్‌ (35), రాపోలు రవి (30), షేక్‌ పీర్‌ సాహెబ్‌ (26), రాపోలు సంపత్‌ (15) పరిచయం ఉన్నారు. ఈ నలుగురు ఆదివారం కారులో ఊరికి వెళ్దామనుకున్నారు. దారిలోనే కావడంతో తమ కుటుంబాన్ని మోత్కూరులో వదిలి వెళ్లాలని జహంగీర్‌ కోరడంతో అంగీకరించారు. ఆదివారం ఉదయం సుచిత్ర వద్ద జహంగీర్‌తోపాటు అతని భార్య, కుమారుడిని ఎక్కించుకున్నారు.


వేగంగా దూసుకొచ్చిన బెంజ్‌ కారు

ఏడుగురు కలిసి కారులో శామీర్‌పేట వద్ద ఔటర్‌ రోడ్డు ఎక్కి ఘట్‌కేసర్‌ దిశగా వెళ్తున్నారు. కీసర వద్ద రింగు రోడ్డుపై ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వైపు వెళ్తున్న బెంజ్‌ కారు దూసుకొచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఓఆర్‌ఆర్‌ మీడియన్‌ని దాటి వీరి కారును ఢీకొట్టింది. రెండు కార్ల ముందు భాగాలు నుజ్జయ్యాయి. కార్లలో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. జహంగీర్‌, సంపత్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుల్తానా, నజీర్‌, శ్రీను, రవి, పీర్‌ను ఆస్పత్రికి తరలించారు. సుల్తానా, నజీర్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బెంజ్‌ కారులోని జాకబ్‌ (36), మరో మహిళ (28) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరు నాగోలు బండ్లగూడలోని సన్‌సిటీకి చెందిన వారు. కారు టైరు పంక్చర్‌ కావడంతో కారు అదుపు తప్పిందని జాకబ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని