logo

25 రోజులు.. 14 గొలుసు చోరీలు

రాజధానిపై గొలుసు దొంగలు పంజా విసురుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలపై దూసుకొచ్చి తేలిగ్గా చోరీలకు తెగబడుతున్నారు.

Updated : 06 Feb 2023 04:54 IST

అటకెక్కిన నిఘా.. కానరాని గస్తీ

రాచకొండ పోలీసులు ఇటీవల పట్టుకున్న ఆభరణాలు

ఈనాడు, హైదరాబాద్‌

* గతనెల 7న ఉప్పల్‌, నాచారం, రాంగోపాల్‌పేట, ఓయూ ఠాణాల పరిధిలో నాలుగు గంటల్లో ఏడు గొలుసు చోరీలు
* 11న అత్తాపూర్‌లో బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌ లాక్కెళ్లిన దుండగులు
* 13న ఎల్బీనగర్‌ కాకతీయ కాలనీలో నడిచి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
* 23న ఆదిభట్లలో కల్లు విక్రయించే మహిళ గొలుసు, లంగర్‌హౌస్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా వచ్చి చైన్‌ స్నాచింగ్‌
* 25న చందానగర్‌ పీఎస్‌ పరిధిలో రెండు చోట్ల గొలుసు దొంగతనాలు
* 31న నిజాంపేటలో ఇంట్లోకి వెళ్తున్న మహిళ మెడలో చోరీ

రాజధానిపై గొలుసు దొంగలు పంజా విసురుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలపై దూసుకొచ్చి తేలిగ్గా చోరీలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి 7న ఉప్పల్‌, నాచారం, రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాల పరిధిలో బవారియా గ్యాంగ్‌ ఏడు గొలుసు చోరీలతో మొదలైన పరంపర.. నెల మొత్తం కొనసాగింది. దాదాపు 25 రోజుల వ్యవధిలో మూడు కమిషనరేట్ల పరిధిలో 14 చోరీలు నమోదయ్యాయి. దీంతో వీధుల్లో నడిచి  వెళ్లాలంటే మహిళలు వణికిపోతున్నారు.


కొత్తవారిపై దృష్టి ఏదీ?

పోలీసులు పాత నేరస్థులపై.. కొత్త ముఠాల రాకపోకలపై దృష్టి పెట్టడం లేదు. పీడీ యాక్టు కింద జైల్లో ఉండి బయటికొచ్చి మళ్లీ నేరాల బాట పడుతున్నారు. ఇటీవల కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌లో 23 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ వారిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నేపథ్యాన్ని పరిశీలించగా అల్వాల్‌, చందానగర్‌, ఏపీలోని అనంతపురం, నంద్యాల ఠాణాల్లో 22 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇంతటి ఘరానా దొంగలు నగరంలో మకాం వేసి... ఒక్కో విడత 10కిపైగా ఇళ్లల్లో చోరీలు చేసినా పోలీసులు పసిగట్టలేకపోయారు. ఒక నిందితుడిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో 30 కేసులున్నాయి. యూపీకి చెందిన బవారియా గ్యాంగ్‌  షామ్లి జిల్లాలో పెద్దఎత్తున నేరాలకు పాల్పడ్డారు.


అంతర్రాష్ట్ర ముఠాలు తిష్ఠ వేసి...

నిఘా వైఫల్యం, అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. సెలవుల్లో, నిత్యం రాత్రిపూట గస్తీ కనిపిస్తున్నా గొలుసు చోరీ ముఠాల కట్టడిపై దృష్టి తగ్గిందని అధికారులే అంగీకరిస్తున్నారు. జనవరిలో చోరీలు.. పగటిపూట కాలనీలు, జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో జరిగాయి.  కొన్ని ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌ వాహనాలు కనిపిస్తున్నా తెల్లారాక వాటి జాడ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని