logo

పల్లె ప్రగతి పనుల లెక్క పక్కా..

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీస సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేస్తున్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

ఆన్‌లైన్లో సమాచారం నమోదు
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్‌ గ్రామీణం

పర్సాపూర్‌లోని పల్లెప్రకృతి వనం

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీస సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. వాటి పనితీరు, నిర్వహణ పక్కాగా తెలుసుకుంటూ.. పారదర్శకత దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రతి పంచాయతీలో ఇంటింటా తిరిగి చెత్త సేకరణ, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నారు. చేపట్టిన పనుల వివరాలను చిత్రాలతో సహా అంతర్జాలంలోని ‘పల్లె ప్రగతి యాప్‌’లో నమోదు చేసే కార్యక్రమం ఆరంభించారు. తద్వారా పనుల లెక్క పక్కాగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అక్షాంశ.. రేఖాంశాలతో చిత్రం

జిల్లాలో కొడంగల్‌, వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని 566 గ్రామ పంచాయతీలతో పాటుగా అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా పల్లె, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ ఫొటోలను ఆన్‌లైన్‌లో నమోదు చేయటానికి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు.

* ఏడు అంశాలకు సంబంధించిన వివరాలను అక్షాంశ, రేఖాంశాలతో కూడిన ఫొటోలు తీసి అందులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాటిన మొక్కలు, సంరక్షణ చర్యలు, ఇంకా ఎన్ని మొక్కలు నాటుతున్నారో నమోదు చేయాలి. వైకుంఠధామాల్లో విద్యుత్‌ సౌకర్యం, బోరు మోటారు పరిస్థితి, క్రీడా ప్రాంగణాల్లో పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై ఛాయాచిత్రాలను జత చేయాలి. అందుకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు యాప్‌లోనే జవాబులను పంచాయతీ కార్యదర్శులే నమోదు చేయాలి. వీరు నిత్యం ఏయే పనులు చేయాలి.. వాటిని పూర్తి చేశారా.. లేదా అనే అంశాలు ఉన్నతాధికారులు తెలుసుకునేలా యాప్‌లోని ప్రశ్నలకు కార్యదర్శులే సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి యాప్‌లో నమోదు తీరును ఆయా మండలాల్లోని ఎంపీడీవో, ఎంపీవోలు పర్యవేక్షణ చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.


ప్రక్రియ కొనసాగుతోంది
- పాండు, ఎంపీడీఓ, బొంరాస్‌పేట

పంచాయతీ కార్యదర్శులు అంతర్జాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిక్షణ ఇస్తూ నమోదుపై అవగాహన కల్పించాం. పంచాయతీ స్థాయిలో వివిధ పనుల ఒత్తిడి కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఆయా పనుల ఛాయాచిత్రాలతో తొందరలోనే వివరాల నమోదును పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని