logo

చేతులు కలిశాయి.. వాదనలు జరిగాయి!

తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సోమవారం శాసనమండలి మీడియా పాయింట్‌ వద్ద అధికార, ప్రతిపక్ష నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, జీవన్‌రెడ్డిల మధ్య ఆసక్తిరమైన వాదన చోటుచేసుకుంది

Updated : 07 Feb 2023 06:24 IST

మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో  కరచాలనం చేస్తున్న భారాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సోమవారం శాసనమండలి మీడియా పాయింట్‌ వద్ద అధికార, ప్రతిపక్ష నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, జీవన్‌రెడ్డిల మధ్య ఆసక్తిరమైన వాదన చోటుచేసుకుంది. ముందుగా మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన జీవన్‌రెడ్డి బడ్జెట్‌ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని, రైతు రుణమాఫీ, పోడు భూముల చర్చ లేదని, ఇతర శాఖల కేటాయింపులకు కోతలు పడ్డాయని మాట్లాడారు. పక్కనే ఉండి విన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌లు జీవన్‌రెడ్డి బయటకు వెళ్తుండగా కరచాలనం చేసి బడ్డెట్‌లో అన్నీ బాగున్నా.. విమర్శలు తగవని అన్నారు. అందుకు జీవన్‌రెడ్డి.. రైతు రుణమాఫీ గురించి చూపించండి అనడంతో.. రాజేశ్వర్‌రెడ్డి తన వద్ద ఉన్న షార్ట్‌నోట్స్‌లో చూపే ప్రయత్నం చేశారు. ‘ఇందులో కాదు.. బడ్జెట్‌ కాపీలో చూపించండి’ అంటూ జీవన్‌రెడ్డి వాదించారు. బడ్జెట్‌ను పూర్తిగా చదువుకుని రండి.. అప్పుడు చర్చిద్దాం అంటూ అధికార పక్ష నేతలిద్దరు మీడియాతో మాట్లాడేందుకు ముందుకు కదిలారు.


సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: బడ్జెట్‌ సబ్బండ వర్గాల సంక్షేమానికి ఊతమిచ్చేదిలా ఉందని భారాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నా స్వశక్తిదాయక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయ రంగానికి మరోమారు పెద్దపీట వేశారన్నారు. కేంద్రం సహకరించకున్నా రుణమాఫీ, కల్యాణలక్ష్మి, పింఛన్లు, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారన్నారు. రెండు పడక గదుల ఇళ్లకు రూ.3 లక్షల చొప్పున కేటాయించడం బాగుందన్నారు.


నగరాభివృద్ధికి నిధుల కేటాయింపు హర్షణీయం
భారాస జిల్లా అధ్యక్షుడు  మాగంటి గోపీనాథ్‌


 

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నగరాభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షణీయమని భారాస హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. సుంకేశుల ప్రాజెక్టుకు రూ.2214 కోట్లు కేటాయించారన్నారు. మురుగు సమస్య పరిష్కారానికి సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ కింద రూ.3866 కోట్లు ఇచ్చారన్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇప్పటికే నగరం నలుమూలలా 27 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయని, రూ.275 కోట్లతో 22 లింకు రోడ్లను పూర్తి చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం, సొంత స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు అందించడం చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు.


ఇది ప్రగతిశీల బడ్జెట్‌
గుర్క జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్యే, కల్వకుర్తి

ఆమనగల్లు, న్యూస్‌టుడే: ప్రగతిశీల బడ్జెట్‌గా ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానిది కుంభకోణాల, పారిశ్రామికవేత్తల, కార్పొరేట్‌ సంస్థల బడ్జెట్‌ అయితే తెలంగాణ సర్కారుది రైతుల, రైతు కూలీల, కార్మికుల బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌తో రాష్ట్రం అన్నిరంగాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. 2014లో రూ.60 వేల కోట్లు ఉన్న బడ్జెట్‌ నేడు రూ. 2,90,396 కోట్లకు చేరడం అసాధారణ విషయమన్నారు.


ప్రతి సామాన్యుడికీ వైద్యం అందుతుంది
డాక్టర్‌ మార్త రమేశ్‌, నిమ్స్‌ అనుసంధానాధికారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైద్యానికి పెద్దపీట వేశారు. నిమ్స్‌కు ఈ బడ్జెట్లో దాదాపు రూ.290 కోట్లు కేటాయించడం విశేషం. నిమ్స్‌కు అత్యధిక బడ్జెట్‌ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు నిమ్స్‌ యాజమాన్యం, ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు.


రూ.20 వేల కోట్లకు పెంచాలి
-  ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: రూ.2.90 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు కేటాయించిన రూ.6,229 కోట్లు సరిపోవు. దీన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలి. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమానికి కొత్త పథకాలు లేవు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, మెస్‌ఛార్జీల పెంపు ప్రస్తావన లేదు. బీసీ స్టడీ సర్కిళ్ల బడ్జెట్‌ పెంచలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
- గుండ్రాతి శారదాగౌడ్‌, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు, మహిళాభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. మహిళల విద్య, వైద్యం, రక్షణకు నిధులు చూపారు.  

సగం నిధులు బకాయిలకే
- రాజేందర్‌పటేల్‌గౌడ్‌, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు

బీసీలకు కేటాయించిన రూ.6,229 కోట్లలో రూ.3 వేల కోట్లు బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలకే పోతాయి. మిగిలిన నిధులు బీసీల సంక్షేమానికి ఏ మాత్రం సరిపోవు

విద్యారంగానికి అన్యాయం
- పి.రామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు

నల్లకుంట, న్యూస్‌టుడే: విద్యారంగానికి అన్యాయం జరిగింది. బడ్జెట్‌ను సవరించి 30 శాతం నిధులు కేటాయించాలి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌. ఓయూకు రూ.1000 కోట్లు, మిగతా విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు కేటాయించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని