logo

సంక్షిప్త వార్తలు

ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ రద్దవుతుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నది గాలి ప్రచారమని రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొట్టిపారేశారు.

Published : 07 Feb 2023 04:06 IST

ముందస్తు ముచ్చటే లేదు -మంత్రి తలసాని  

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ రద్దవుతుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నది గాలి ప్రచారమని రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొట్టిపారేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని లింగమంతులస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందస్తు అనే ముచ్చటే లేదని, రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. పదవుల కోసం పాకులాడుతున్న ఉత్తమ్‌ తన రాజకీయ చరిత్రలో ఒకరి మోచేతి నీళ్లు తాగిన వ్యక్తే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేరని ఎద్దేవా చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ చేసిన అభివృద్ధిలో 10 శాతం కూడా చేయలేదని.. దీనిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ వారు నలుగురు నాలుగు దిక్కులుగా మాట్లాడుతుంటారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. గత ప్రభుత్వాల్లో కేవలం ఒక పంటకు నీరందించడమే కష్టంగా ఉండేదని, నేడు రెండు పంటలకు నీరందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లి పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌ వెంకట్‌రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌, ఫిష్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఆర్డీవో కిషోర్‌కుమార్‌, ఎంపీపీ కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


1న 39 స్థలాలకు ఈ-వేలం

ఈనాడు, హైదరాబాద్‌: మూడు జిల్లాల పరిధిలో మరోసారి స్థలాల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి పరిధిలో 39 పార్శిళ్లకు ఈ-వేలం నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు  ఈ నెల 27 గడువుగా నిర్ణయించారు. రూ.1,180 (తిరిగి ఇవ్వని) ఫీజు చెల్లించాలి. మార్చి 1న ఈ-వేలంలో స్థలాలు విక్రయించనున్నారు. గతంలో నోటిఫికేషన్‌ ఇవ్వగా 9 పార్శిళ్లకు భారీ ధర పలికింది. రూ.190 కోట్లు వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మిగిలిన స్థలాలను విక్రయించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రంగారెడ్డిలో 10 పార్శిళ్లకు సంబంధించి చదరపు గజానికి 20 వేల నుంచి లక్ష వరకు నిర్ణయించారు. కంచ గచ్చిబౌలిలో 1,210 గజాల స్థలానికి కనీస ధర రూ.లక్షగా నిర్ణయించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పోచారం, బాచుపల్లిలో 6, సంగారెడ్డి అమీన్‌పూర్‌లోని 23 ప్రాంతాల్లో స్థలాలకు వేలం వేయనున్నారు. వివరాలకు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.  


టెక్‌ మహీంద్ర ఉపాధి శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు నెలలపాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ, అనంతరం ఉపాధి కల్పిస్తామని మేనేజర్‌ గౌస్‌పాషా తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన వారికి కంప్యూటర్‌ బేసిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ 2010, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ టైపింగ్‌, కమ్యూనికేటివ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌, బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్‌, బేసిక్‌ అక్కౌంట్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 25లోపు 7674985461, 7093552020 నంబర్లలో పేర్లు నమోదు చేయించుకోవాలి.


శ్రీశైల క్షేత్రానికి 390 ప్రత్యేక బస్సులు

బేగంబజార్‌, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి టీఎస్‌ఆర్టీసీ 390 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఎంజీబీఎస్‌తో పాటు జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ఐ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఇఎల్‌తో పాటు నగర శివారు ప్రాంతాల నుంచి వీటిని నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ వెల్లడించారు. వివరాల కోసం  

* ఎంజీబీఎస్‌-9959226250, 9959226248, 9959226257,

* జేబీఎస్‌-9959226246,  040-27802203

* ఐఎస్‌ సదన్‌-9959226250, బీహెచ్‌ఇఎల్‌-9959226149 నంబర్లలో సంప్రదించాలి.


విద్యా రంగంలో అవకాశాలు సద్వినియోగం చేసుకోండి

ఆదిభట్ల, న్యూస్‌టుడే: విద్యారంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యూఎస్‌ఏలోని ఓల్డ్‌ డొమినియన్‌ విశ్వవిద్యాలయం (ఓడీయూ) అధ్యాపకుడు ప్రొఫెసర్‌ స్టీవెన్‌ రిచీ అన్నారు. సోమవారం సాంకేతిక పరిజ్ఞాన విస్తృతిని పెంచుకోవడానికి మంగళపల్లిలోని సీవీఆర్‌ కళాశాల ఓల్డ్‌ డొమినియన్‌ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీవీఆర్‌ కళాశాలలో విద్యార్థుల ఆవిష్కరణలను ఓడీయూ ప్రొఫెసర్లు స్టీవెన్‌ రిచీ, అజయ్‌గుప్తా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్టీవెన్‌ రిచీ మాట్లాడారు. తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సీవీఆర్‌ కళాశాల డైరెక్టర్‌ కె.రామశాస్త్రి, ప్రిన్సిపల్‌ కె.రామ్‌మోహన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ శివారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని