logo

కాలుష్యంపై ఫిర్యాదులు.. కానరాని చర్యలు

తాండూరు మండలం కరణ్‌కోట పరిధిలో ఇండస్‌చెమ్‌ జిప్సం పరిశ్రమ నుంచి కాలుష్యం వెలువడుతోందంటూ గుంతబాస్పల్లి గ్రామస్థులు ఇటీవలే మూకుమ్మడిగా పరిశ్రమ ముందు బైఠాయించి ధర్నా చేశారు

Published : 08 Feb 2023 02:47 IST

ధర్నా చేసినా పట్టని అధికారులు  

కంపెనీ ఎదుట గ్రామస్థుల ఆందోళన

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: తాండూరు మండలం కరణ్‌కోట పరిధిలో ఇండస్‌చెమ్‌ జిప్సం పరిశ్రమ నుంచి కాలుష్యం వెలువడుతోందంటూ గుంతబాస్పల్లి గ్రామస్థులు ఇటీవలే మూకుమ్మడిగా పరిశ్రమ ముందు బైఠాయించి ధర్నా చేశారు. పట్టణం, నగరంలోని కార్యాలయాలకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అధికారులు కాలయాపన చేస్తున్నారని, పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

లారీలు, ట్యాంకర్లలో రాత్రివేళ తరలింపు..: పొరుగునున్న హైదరాబాద్‌, సరిహద్దునున్న కర్ణాటకలోని ఫార్మా, రసాయన కర్మాగారాల నుంచి వ్యర్థాలను లారీలు, ట్యాంకర్లలో పరిశ్రమకు రాత్రివేళ తరలిస్తున్నారు. ద్రవ, ఘన రూపంలోని రసాయన వ్యర్థాలతో సిమెంటు తయారీలో వినియోగించే ముడిసరకు జిప్సం తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్ర రంగులోని వ్యర్థాలు పరిసరాల్లో నిలుస్తున్నాయి. నేలలోకి ఇంకి కిలో మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు విషతుల్యంగా మారుతున్నాయి.

మూసివేయాలంటూ ప్రదర్శన

పరిశ్రమను మూసివేయాలని గ్రామస్థులు సర్పంచి ఏర్పుల జగదీష్‌ అధ్వర్యంలో గతనెల 21 ధర్నాకు దిగారు. పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో వారు వ్యవసాయ, ఆర్డీఓ, పాలనాధికారి కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌ బేేగంపేటలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయానికి చేరుకొని పరిశ్రమను మూసివేయించాలని ఫిర్యాదు చేశారు. తాండూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి రోహిత్‌రెడ్డికి కూడా మొరపెట్టుకున్నారు. 

నమూనాలు సేకరించాం.. : సిద్ధార్థ, ఏఈ, కాలుష్య నియంత్రణ మండలి

తాండూరు మండలంలోని రెండు జిప్సం పరిశ్రమలను ఇటీవల సందర్శించి నమూనాలు సేకరించాం. వ్యర్థాలు, రసాయనాలతో కాలుష్యం ఉన్నట్లు గుర్తించాం. పరిశ్రమల్ని మూసివేసేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం.

తాగునీరు కలుషితమైంది: బిచ్చమ్మ, గుంతబాస్పల్లి

బోర్ల నుంచి ఎర్ర రంగు, నూనెతో కూడిన నీరు వస్తోంది. పరిశ్రమ యాజమాన్యం నుంచి పంట నష్ట పరిహారం ఇప్పించి పరిశ్రమనుఇక్కడినుంచి తరలించాలి.

అనుమతులు పొంది ధర్నా: ఏర్పుల జగదీష్‌, సర్పంచి

పరిశ్రమ మూసేయాలని ధర్నా చేస్తే అనుమతి లేదని పంపించారు. అనుమతులు పొంది మరోసారి ధర్నా చేసేందుకు యోచిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని