logo

చిన్నారికి ఆరోగ్య మస్తు

అధిక శాతం పేద, రైతు కుటుంబాలే ఉన్న జిల్లాలో శిశు సంక్షేమ శాఖ సేవలు ఎంతో కీలకంగా మారుతున్నాయి.

Published : 08 Feb 2023 02:47 IST

పోషక లోపం నివారణకు కార్యాచరణ
అంగన్‌వాడీల్లో ఫలిస్తున్న పర్యవేక్షణ  
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, వికారాబాద్‌ గ్రామీణ, తాండూరు

అధిక శాతం పేద, రైతు కుటుంబాలే ఉన్న జిల్లాలో శిశు సంక్షేమ శాఖ సేవలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు అంగన్‌వాడీ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణతో చిన్నారుల్లో పోషక లోపాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ చేపడుతున్నారు.

పుట్టిన రోజునుంచే లెక్క..

జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 1106 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 3-6ఏళ్లలోపు 52,400 మంది పిల్లలున్నారు. 6082 మంది గర్భిణులు, 6132 మంది తల్లులు సమీప అంగన్‌వాడీల ద్వారా తగు సలహాలు పొందుతున్నారు. ఆహారం తీసుకుంటున్నారు. ఇప్పటికే తల్లులు, పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న ఐసీడీఎస్‌ మరో అడుగు ముందుకేసింది.

* పిల్లల్లో ఎదుగుదల, బరువు పెరగడంలో లోపాలను గుర్తించి నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం గతేడాది ఆగస్టు నుంచి ‘పర్యవేక్షణ కార్డులను’ అమలు చేస్తోంది. చిన్నారులు పుట్టిన రోజు నుంచి ఐదు సంవత్సరాల పాటు ప్రతినెలా బరువు, ఎత్తు, జబ్బ చుట్టు కొలత తదితర అంశాలను అందులో పొందుపరుస్తున్నారు.

ఎప్పటికప్పుడు బేరీజు

అధికారుల నమోదుతో సరిపెట్టక గత నెలలో నమోదు, ప్రస్తుత నెలలో పరిస్థితులను బేరీజు వేస్తూ లోపాలను గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటికే బాలామృతం వంటి అనుబంధ పోషకాహారాన్ని కూడా అందజేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి పర్యవేక్షణ కార్డులను అమలు చేయడంతో చిన్నారుల్లో శారీరక, మానసిక మార్పులు కనిపిస్తున్నాయి. 


ప్రత్యేక దృష్టి పెట్టాం

- లలితకుమారి, జిల్లా మహిళా సంక్షేమాధికారిణి

ఆరోగ్య పరంగా వెనుకబడిన పిల్లల సంరక్షణ విషయమై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతినెలా ఎత్తుకు తగిన బరువు, వయస్సుకు తగిన ఎత్తు ఉన్నారా లేదా అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తూ కార్డుల్లో నమోదుచేస్తున్నాం. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలను రాబడుతున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కేంద్రాల పనితీరును మెరుగు పరిచేందుకు కూడా కృషి చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని