logo

మేయర్లు... ఛైర్మన్లపై అసంతృప్తుల పట్టు

‘‘మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయకుండా పెద్దవాళ్లతో మాట్లాడుకుంటున్నాం... మీరెంత అంటూ ధిక్కారం ప్రదర్శిస్తున్న మేయర్లు.. ఛైర్మన్లు మాకొద్దు.

Published : 08 Feb 2023 02:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయకుండా పెద్దవాళ్లతో మాట్లాడుకుంటున్నాం... మీరెంత అంటూ ధిక్కారం ప్రదర్శిస్తున్న మేయర్లు.. ఛైర్మన్లు మాకొద్దు...   భారాస పార్టీ పరువు, ప్రతిష్ఠలకు మూడేళ్లు ఓపికపట్టాం... ఇకపై మాదారి మేం చూసుకుంటాం... మాకు గౌరవం ఇచ్చే పార్టీలోకి మారిపోతాం... మేయర్‌, ఛైర్మన్ల పదవుల నుంచి దిగిపోవాల్సిందే... వారంతటవారు రాజీనామా చేస్తే పార్టీలో కొనసాగుతాం..’’

* జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, మేడ్చల్‌, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కౌన్సిలర్ల తమ పార్టీ నేతలతో అంటున్న మాటలివి. ఇటీవల మేయర్లు, ఛైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన వారు ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి బుజ్జగించినా, ఎమ్మెల్యేలు సర్దిచెప్పినా ససేమిరా అంటున్నారు. 

మేడ్చల్‌, దమ్మాయిగూడ మున్సిపాలిటీల అవిశ్వాస తీర్మాన పత్రాలు

సమష్టిగా నిర్ణయాలు.. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు  తాము చేస్తున్న పనులను రహస్యంగా ఉంచాలని, విభజించు పాలించు అన్నట్టు ఒక్కొక్కరితో మాట్లాడి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తారని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. జవహర్‌నగర్‌ మేయర్‌పై అవిశ్వాసం ప్రకటించిన కార్పొరేటర్లు, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో ఎప్పటిలాగానే పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, దమ్మాయిగూడ మున్సిపల్‌ కౌన్సిలర్లు నగర పాలక సంస్థ కార్యాలయాలకు వచ్చి అభివృద్ధి పనుల తీరుపై వాకబు చేస్తున్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లలో కొందరిని ఓ ప్రజాప్రతినిధి మాట్లాడదాం రండి అంటూ ఆహ్వానించగా... తాము రాలేమంటూ ఆయనకు

చెప్పినట్టు సమాచారం.రాజీ యత్నాలు...  రాయ‘బేరాలు’

అవిశ్వాస తీర్మానాలు ఉపసంహరింపజేసేందుకు, కొత్తగా అవిశ్వాస తీర్మానాలను సిద్ధం చేసుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై భారాస నేతలు దృష్టి సారించారు.  వార్డుల్లో అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరు చేయిస్తామంటూ వివరిస్తున్నారు. మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను పిలిచి ఆర్థికంగా ఆదుకుంటామని చెబుతున్నారు. ఒక ఛైర్‌పర్సన్‌ తోటి కౌన్సిలర్లకు ఫోన్‌ చేసి భోజనానికి రావాలంటూ ఆహ్వానించగా... ‘నువ్వు వద్దు.. నీ భోజనం వద్దు... ముందుకు రాజీనామా చెయ్‌’ అంటూ చెప్పినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని