logo

నకిలీ పట్టాలకు డిజిటల్‌ చెక్‌

ఇంజినీరింగ్‌, డిగ్రీ చదవకుండానే నకిలీ ధ్రువపత్రాలను కొంటున్న వారికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 08 Feb 2023 02:40 IST

వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, డిగ్రీ చదవకుండానే నకిలీ ధ్రువపత్రాలను కొంటున్న వారికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందరి విద్యార్హత పత్రాలను డిజీ లాకర్‌లో నిక్షిప్తం చేయాలంటూ యూజీసీ ద్వారా అన్ని వర్సిటీలను ఆదేశించింది. ఆ లాకర్ల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించింది. విదేశాల్లో ఉన్నత విద్య ప్రవేశాలు మొదలవడం, దేశం నుంచి విద్యార్థులు అమెరికా, ఐరోపా, అస్ట్రేలియాలకు వెళ్తుండడంతో కేంద్ర మానవవనరుల శాఖ అప్రమత్తమైంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, యూజీసీ అధికారులు దక్షిణాది రాష్ట్రాల్లోని వర్సిటీల అధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా కొద్దిరోజుల కిందట సమావేశం నిర్వహించారు. పదేళ్ల క్రితం నాటి విద్యార్థుల పత్రాలన్నీ తొలుత డిజిటలీకరణ చేయాలని, తర్వాత 20 ఏళ్లు, 30 ఏళ్ల రికార్డులను డిజిటలీకరణ చేయాలని సూచించారు.

హాలోగ్రామ్‌ సహా తయారీ..

విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదవాలని, అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడాలన్న లక్ష్యంతో కొందరు విద్యార్థులు రూ.లక్షలు చెల్లించి నకిలీ ఇంజినీరింగ్‌, డిగ్రీ సర్టిఫికెట్లు కొంటున్నారు. వీటిని తయారుచేస్తున్న అక్రమార్కులు వర్సిటీల హాలోగ్రామ్‌ సైతం సృష్టిస్తున్నారు. ప్రతి విద్యార్థి ధ్రువపత్రాలు సరైనవా? కావా? అని పరిశీలించేందుకు సమయం లేక విదేశీ వర్సిటీలు అక్కడి ఏజెన్సీలకు పరిశీలన బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఆ ఏజెన్సీలు మన వర్సిటీలను సంప్రదించినప్పుడు హాలోగ్రామ్‌ పంపగా కొన్ని వర్సిటీల అధికారులు నకిలీవంటుంటే.. మరికొందరు ఆ హాలోగ్రామ్‌ తమవేనంటున్నారు. రెండేళ్లలో హైదరాబాద్‌ నుంచే సుమారు వెయ్యిమంది విద్యార్థులు వెళ్లగా 300 మంది అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు సాంకేతిక ఇబ్బందులుండటంతో వారు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వీసాను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించారు.

ఉపయోగాలివీ..

డిజీ లాకర్‌ అంటే విద్యార్థుల విద్యార్హత పత్రాలను డిజిటలీకరణ చేసి ప్రత్యేక సొరుగులో భద్రపరచడమే. అలా డిజీ లాకర్‌లో విద్యార్థి పేరు, విద్యార్హత పత్రం నమోదు చేయగానే నకిలీవి అయితే ‘ఫైల్‌ నాట్‌ ఫౌండ్‌’ అని చూపుతుంది.
* ఎవరైనా విద్యార్హత పత్రాల్లో మార్కులను దిద్దుకున్నా (ట్యాంపరింగ్‌), నాలుగేళ్లలో పాస్‌ కాకపోతే పాస్‌ అయినట్టు నకిలీ పత్రాలు సృష్టించినా డిజీ లాకర్‌లో వివరాల ఆధారంగా నిజం నిరూపించవచ్చు.
* ఎవరైనా పత్రాలు పోగొట్టుకున్నా వర్సిటీని సంప్రదించి అఫిడవిట్‌ సమర్పిస్తే డిజిటల్‌ విద్యార్హత పత్రాలను జారీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు