logo

Hyderabad: దొంగలకు చేదు అనుభవం.. సిగరెట్‌ అడిగి గొలుసు లాక్కెళ్లినా..

హయత్‌నగర్‌లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న కాలనీల్లోని షాపుల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు.

Updated : 28 Feb 2023 08:54 IST

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: హయత్‌నగర్‌లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న కాలనీల్లోని షాపుల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. మూడ్రోజుల క్రితం  దుకాణంలో ఉన్న మహిళను కత్తితో బెదిరించి గొలుసు అపహరణకు యత్నించిన సంగతి తెలిసిందే. తాజాగా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు.. హయత్‌నగర్‌కు చెందిన మేక సునీత ప్రకాశ్‌రెడ్డి(40) స్థానికంగా పుల్లారెడ్డి స్వీట్‌ షాపు సమీపంలోని ఆదిత్యనగర్‌ కాలనీలో కిరాణ షాపు నిర్వహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై షాపు వద్దకు వచ్చారు. బైకు వెనుక కూర్చొన్న హెల్మెట్‌ ధరించిన వ్యక్తి షాపులోకి వెళ్లి సిగరెట్‌ కావాలని అడిగాడు. సిగరెట్‌ తీసి ఇస్తుండగా ఆమె మెడపై కత్తి పెట్టి.. బెదిరించి గొలుసు లాక్కొని పారిపోయారు. 

ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే దొంగలకు చేదు అనుభవమే ఎదురైనట్లైంది. సదరు గొలుసు రోల్డ్‌గోల్డ్‌ కావడం కొసమెరుపు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని