logo

సరికొత్త ఏకరూపం.. సకాలంలో పంపిణీ ముఖ్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన రోజునే ఏకరూప దుస్తులు అందించేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది.

Updated : 21 Mar 2023 06:15 IST

జూన్‌లో విద్యార్థులకు అందించాలని నిర్ణయం

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన రోజునే ఏకరూప దుస్తులు అందించేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది. 2022-23 ఏడాదిలో పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలైనా ఏకరూప దుస్తులు అందరికీ రాలేదు. ఈ నేపథ్యంలో 2023-24లో సకాలంలో పంపిణీ  చేయాలని నిర్ణయించారు.


నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో.

వస్త్రం, కుట్టులో నాణ్యత లేక తొందరలోనే చిరిగిపోతున్నట్లు ప్రతి ఏడాది తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం నాణ్యతతో కూడిన దుస్తులు అందించాలని మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో ఆకట్టుకునే విధంగా కొత్త డిజైన్లను రూపొందించారు.

* కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను మినహాయించి జిల్లాలో 92,132 మంది విద్యార్థులకు 4,69,825.10 మీటర్ల వస్త్రాన్ని టెస్కో ద్వారా సరఫరా చేయనున్నారు.

* బాలబాలికల దుస్తుల రంగులు ఒకే విధంగా ఉండేలా చూస్తున్నారు. ఫ్యాషన్‌ డిజైనర్లు సిఫారసు చేసినట్లు దుస్తుల తయారీలో మార్పులు చేశారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుతున్న బాలికలకు బెల్టు రింగులు రూపొందించారు. స్లీవ్‌లపై సూటింగ్‌ రంగు పట్టీలతో ముద్రించిన ఎరుపు, బూడిదరంగు గీతలతో చొక్కాను తయారు చేస్తున్నారు. నాలుగు, ఐదోతరగతి బాలికలకు స్కర్ట్‌, రెండు ప్యాకెట్లతో పాటు దానిపై పట్టీలతో కూడిన షర్టును ఇస్తారు. ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు ఎరుపు, బూడిద రంగులో పంజాబీ శైలి దుస్తులు కుట్టిస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న బాలురకు నిక్కరు, షర్టు ఉండగా 8-12 తరగతుల వారికి ప్యాంటు, చొక్కా అందిస్తారు.

* ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులులో సమభావం పెంచేందుకు ప్రభుత్వ ఒకే రంగు దుస్తులు ఏడాదికి రెండు జతలు పంపిణీ చేస్తోంది.  


పాఠశాలలు తెరిచే నాటికి సిద్ధం చేస్తాం
- రేణుకాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి

పాఠశాలలు ప్రారంభించే జూన్‌ నెల నాటికే విద్యార్థులు కొత్త ఏకరూప దుస్తులు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అందుకు ఈ నెలాఖరు నాటికే పాఠశాలలకు వస్త్రాన్ని సరఫరా చేస్తాం. అందుబాటులోని దర్జీలతో ప్రభుత్వం సూచించిన డిజైన్లతో తరగతి వారీగా కుట్టించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని