logo

ఆయువు తీస్తున్న అంతరం

మార్చి 16.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి అప్పుడే కదులుతున్న పుష్‌పుల్‌ రైలు దిగుతూ.. ప్రమాదవశాత్తు పట్టాలపైకి జారిపోయారు రాచర్ల సంధ్యారాణి(40).

Published : 21 Mar 2023 03:06 IST

బోగీకి - ప్లాట్‌ఫాంకు పెరిగిన దూరం
వరుస ప్రమాదాలకు ఇదే కారణం

* మార్చి 16.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి అప్పుడే కదులుతున్న పుష్‌పుల్‌ రైలు దిగుతూ.. ప్రమాదవశాత్తు పట్టాలపైకి జారిపోయారు రాచర్ల సంధ్యారాణి(40). ఇంతలో రైలు కదిలింది. అక్కడికక్కడే చనిపోయారు. కాపాడే ప్రయత్నంలో సంధ్యారాణి భర్త ప్రభాకర్‌ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.

* మార్చి 14 లింగంపల్లి రైల్వే స్టేషన్‌.. ఉదయం 11.59 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫాం 1 నుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరుతోంది. అందుకోవాలనే ప్రయత్నంలో శశికాంత్‌ అనే ప్రయాణికుడు జారిపడ్డాడు.  రైల్వే రక్షణ దళానికి చెందిన కానిస్టేబుల్‌ విశ్వజిత్‌ కుమార్‌ గమనించి పరుగెత్తుకు వెళ్లి పైకి లాగేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

ఇలా రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అదుపుతప్పి ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలు అనేకం. ఈ ప్రమాదాలకు మానవ తప్పిదాలతో పాటు ప్లాట్‌ఫాంకి - బోగీకి మధ్య పెరిగిన దూరం కారణం కూడా ఒకటి.

ఈనాడు - హైదరాబాద్‌


ఎత్తు పెరిగిన ప్లాట్‌ఫామ్‌లు

డీజిల్‌ ఇంజిన్‌తో నడిచే రైళ్లకోసం తక్కువ ఎత్తులో.. చిన్న స్టేషన్లలో లో లెవెల్‌, పాసింజర్‌ రైళ్లు ఆగేందుకు మీడియం లెవెల్‌, పెద్ద స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు హైలెవెల్‌ ప్లాట్‌ఫాంలు ఉండేవి. రానున్నవి ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడిచే రైళ్లే కనుక ఆ విధంగా అన్ని స్టేషన్లలో ప్లాట్‌ఫాంల ఎత్తును పెంచారు. కానీ ఆయా స్టేషన్లలో ఎంఎంటీఎస్‌, ప్యాసింజర్‌, మెమూ, డెమూ, పుష్‌పుల్‌ రైళ్లు కూడా ఆగుతున్నాయి. దీంతో బోగీ నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌ మీద అడుగు పెట్టాలంటే.. కనీసం రెండు అడుగుల దూరం ఒక్కో చోట ఉంటోంది. ఈ దూరమే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతోందని, కదిలే రైళ్ల నుంచి దిగడం, ఎక్కడం చేయకూడదని అధికారులు చెబుతున్నారు.


అశాస్త్రీయంగా ప్లాట్‌ఫాంల నిర్మాణం..

ఇటీవల అన్ని స్టేషన్ల సామర్థ్యం పెంచారు. 24 బోగీలు ఆగే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు ప్లాట్‌ఫాం ఎత్తు పెంచడమే కాకుండా.. పొడవును కూడా పెంచారు. వీటి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కరవవుతోంది. తర్వాత చూసి తేడాలున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో రైలునుంచి జారిపడిన వారు ప్లాట్‌ఫాంపైన పడకుండా.. పట్టాలపైకి జారిపోతున్నారని రైల్వే గ్యాంగ్‌మన్లు చెబుతున్నారు. రైల్వే అధికారులు ఇప్పటికైనా స్పందించి.. లోపాలను సరి చేయాలని రైల్వే ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్‌మహ్మద్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని