logo

నివారిద్దాం.. సన్నద్ధమవుదాం

వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపకశాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో మరోసారి ఫైర్‌ ఆడిట్‌ నిర్వహిస్తోంది.

Published : 21 Mar 2023 02:46 IST

మరోసారి ఫైర్‌ ఆడిట్‌కు సిద్ధమైన అగ్నిమాపక శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపకశాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో మరోసారి ఫైర్‌ ఆడిట్‌ నిర్వహిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల్లో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయో లేదో.. లైఫ్‌సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించి అక్కడి సిబ్బందికి అవగాహన కల్పిస్తూ ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయనుంది. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేటర్‌లో 32 ఫైర్‌స్టేషన్ల పరిధిలో ఫైరింజన్లకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి 3 నెలలకోసారి ఫైర్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాల నివారణకు వైరింగ్‌ పరిశీలన, ఎలక్ట్రిక్‌ ఉపకరణాల వినియోగం, ఎలక్ట్రీషియన్లతో పునః పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు, భవనాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, సినిమా థియేటర్లలో పనిచేసే సెక్యూరిటీగార్డులు, సిబ్బందికి వట్టినాగులపల్లిలోని సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంటలు ఆర్పేందుకు నిరంతర నీటి సరఫరా ఉండేలా జలమండలి, జీహెచ్‌ఎంసీ విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు.

* హోటల్‌ ప్రతి అంతస్తులో మెట్లు, ద్వారాలు, అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ఎస్కేప్‌ ప్లాన్‌ ఉంచాలి. ఏసీల ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా డ్యాంపర్లను ఏర్పాటు చేయాలి.  

* ఆసుపత్రి ఫ్లోర్‌లను ఫైర్‌ కంపార్ట్‌మెంట్లుగా విభజించాలి. ఆసుపత్రుల్లో వాడే గ్యాస్‌ని నిల్వ చేయడంతో జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర ద్వారాలకు తాళాలు వేయకూడదు.  

* నగరంలో మొత్తం 80 వేలకుపైగా గోదాములున్నాయి.గోదాముల్లో మెటీరియల్‌ సేఫ్టీ డేటా షీట్ల ఏర్పాటు, ఏయే రసాయనాలు వినియోగిస్తున్నారు, వాటి నిర్వహణ వివరించే బోర్డులున్నాయో లేదో పరిశీలించనున్నారు. వేసవిలో స్టోరేజ్‌ పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని