logo

ఉద్దేశం బాగు.. ఉపాధి జాగు..!

గ్రామాలకు చెందిన కూలీలు, పేదలు పట్టణాలకు వలస వెళ్లకుండా సొంతూరులోనే పనులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది.

Published : 23 Mar 2023 02:29 IST

సకాలంలో అందని డబ్బులు
వందరోజుల పనిదినాలు నామమాత్రం  

నర్సరీలో పనులు చేస్తున్న కూలీలు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: గ్రామాలకు చెందిన కూలీలు, పేదలు పట్టణాలకు వలస వెళ్లకుండా సొంతూరులోనే పనులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. అందులో భాగంగా 2005 నుంచి ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ అమలుచేస్తోంది. ఉద్దేశాలు, లక్ష్యాలు బాగున్నా  కూలీలకు ఒక్కో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నా సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే పూర్తి అవగాహన కల్పించక పోవడం వంటి కారణాలతో కొందరికే పరిమిత మవుతోందనే విమర్శలొస్తున్నాయి. 

విస్తరిస్తూ పోతున్నారు

గ్రామాల్లో ‘వంద రోజుల పని’గా పిలుచుకునే పథకం కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో కొన్ని పనులకే పరిమితమైన పథకంలో ఎక్కువ పనులు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. నీటి సంరక్షణ, వ్యవసాయ పొలాల్లో భూసారం, భూగర్భజలాల పెంపు పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, ఇంకుడుగుంతలు, మట్టికట్టలు, బావుల పూడికతీత, పాఠశాలల్లో వంటగదులు, శౌచాలయాల నిర్మాణాలు సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట వైకుంఠధామాలు, పొలాల్లో పంట కల్లాల పనులు తదితరాలు చేపట్టారు.

నమ్మకం పెట్టుకున్నా..: ఉపాధిలో కూలీలకు సకాలంలో డబ్బులు ఇవ్వక పోవడమే పనులకు వెళ్లటానికి ఆసక్తి చూపలేక పోతున్నామని కొందరు కూలీలు తెలిపారు. గ్రామీణ నేపథ్యమున్న జిల్లాలో ఉపాధి పథకంలో చేపట్టే కూలీ పనులపైనే ఆధారపడిన కొందరు లబ్ధిపొందుతున్నారు. వ్యవసాయ పనులతో పాటుగా ఉపాధి పనులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఉదయం పూట పనులు చేసుకొని మళ్లీ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. దీంతో పేదలకు ఉపాధి డబ్బులు ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరిపడు సిబ్బంది లేకపోవటం, సకాలంలో డబ్బులు అందకపోవటంతో కూలీలు చొరవ చూపలేకపోతున్నారు.  

రైతులు ముందుకు రావాలి: పాండు, ఎంపీడీఓ, బొంరాస్‌పేట

పనులు చేసుకునేందుకు అనువైన వ్యవసాయ పొలాలుండగా భూగర్భ జలాలు పెంచుకునే ందుకు రైతులు ముందుకు రావాలి. భూ అభివృద్ధి కోసం కేటాయించిన పనులు చేసుకుంటే కూలీలకు ఉపాధి కలుగుతూ రైతులకూ ప్రయోజనం చేకూరుతుంది. అవకాశాలున్నప్పుడే పనులు చేసుకునే విధంగా కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం.

* మొత్తం జాబ్‌ కార్డులు.. 1,90,567
* పనులు చేసింది.. 2,35,643 మంది
* 2022-23 మార్చి మూడో వారం నాటికి వంద రోజులు పూర్తి చేసింది.. కేవలం 1,664 కుటుంబాలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని