logo

స్వీయ పొరపాటు.. కుటుంబానికి చేటు

మద్యం తాగి వాహనం నడపడం నేరమైనా కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు.

Published : 23 Mar 2023 02:29 IST

తాగి నడిపితే బీమా పరిహారం రానట్లే..
రోడ్డు ప్రమాదాల వేళ నమూనాల సేకరణ
న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు గ్రామీణ, తాండూరు

ద్యం తాగి వాహనం నడపడం నేరమైనా కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారంతా ఇక మీదట వాహన బీమా ప్రయోజనాన్ని పొందలేరు. ఎందుకంటే తాగి వాహనం నడిపినట్లు కేసులు నమోదై అనర్హులుగా గుర్తింపు పొందుతారు. తద్వారా వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థికంగా తీరని నష్టాన్ని, కష్టాన్ని పొందక తప్పదు.  

శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు

ప్రమాదానికి కారకులను గుర్తించడం, ఆధారాలు సేకరించడం గతంలో పోలీసులకు కష్టంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగిన వెంటనే చోదకుల నుంచి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ఒకవేళ చనిపోతే జీర్ణాశయం నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. తాగి నడిపినట్లు శాస్త్రీయంగా నిరూపించి.. ఐపీసీ సెక్షన్‌ 304ఏ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఫలితంగా ప్రమాదం సమయంలో మరో వాహనం చోదకునిపై కేసు లేకుండా పోవడంతో పాటు మృతుడికి సంబంధించిన బీమా ప్రయోజనాలు, కేసుకు సంబంధించిన పరిహారం దక్కకుండా పోతాయి. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆశించినా ఫలితం ఉండదు.

కొన్ని ఉదాహరణలు

* వికారాబాద్‌ మండలం గొట్టిముక్ల సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించారు. తాగి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. ఫలితంగా వాహనానికి బీమా సౌకర్యం కోల్పోయారు.  

* వికారాబాద్‌ పురపాలక పరిధిలోని శివారెడ్డిపేట సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.  ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మరణోత్తర పరీక్షలతో పాటు శరీరం నుంచి నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఆ రిపోర్టులో మద్యం మత్తులో ద్విచక్ర వాహనదారుడు ఉన్నట్లు తేలడంతో ఆ విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఫలితంగా మృతుడికి వ్యక్తిగతంగా లభించాల్సిన బీమా ప్రయోజనాలు అతడి కుటుంబ సభ్యులు పొందలేకపోయారు.

* జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 56 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 32 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అధికంగా తాగి వాహనం నడిపిన కేసులే ఉండటం గమనార్హం.


బాధ్యతగా నడుచుకోవాలి
మురళీధర్‌, ఏఎస్పీ, వికారాబాద్‌

రిపోర్టులో మద్యం తాగినట్లు వస్తే వాహన చోదకుడిపై కేసు నమోదు చేస్తాం. తద్వారా అతను పూర్తిగా బీమా ప్రయోజనాలు కోల్పోతారు. కుటుంబానికి తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి వాహనచోదకులు బాధ్యతగా నడుచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని