logo

రెండు పడక గదుల ఇళ్లిప్పిస్తానంటూ బురిడీ

తాను ప్రభుత్వ ఉద్యోగినని, తనకున్న పలుకుబడితో రెండు పడక గదుల ఇళ్లిప్పిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టించి రూ.4.75లక్షలు స్వాహా చేసి ఉడాయించిన వ్యక్తిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Mar 2023 02:29 IST

తరుణ్‌గౌడ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: తాను ప్రభుత్వ ఉద్యోగినని, తనకున్న పలుకుబడితో రెండు పడక గదుల ఇళ్లిప్పిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టించి రూ.4.75లక్షలు స్వాహా చేసి ఉడాయించిన వ్యక్తిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడ దాసారంబస్తీకి చెందిన ఎం.ధనలక్ష్మి(30)కి ఆమె సోదరుడి ద్వారా బాగుల తరుణ్‌గౌడ్‌(43) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రభుత్వ ఉద్యోగినని రెండు పడక గదుల ఇళ్లిప్పిస్తానంటూ అతను నమ్మబలికాడు. ఇల్లు కావాలంటే రూ.75 వేలు చెల్లించాలన్నాడు. నమ్మిన ధనలక్ష్మి గతేడాది మే 23న రూ.75వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించింది. ఇంకా ఎవరికైనా ఇళ్లు కావాలంటే చెప్పాలంటూ తరుణ్‌గౌడ్‌ చెప్పడంతో తన సోదరి శ్రీలక్ష్మితోపాటు తెలిసినవారైన శ్రీలత, రాజేశ్వరిలకు కూడా చెప్పింది. వీరంతా ఇళ్ల కోసం తరుణ్‌గౌడ్‌కు డబ్బులు ముట్టచెప్పారు. మొత్తం రూ.4.75లక్షలను తీసుకుని తరుణ్‌గౌడ్‌ ఉడాయించాడు. ఇళ్లు ఇప్పించకపోగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు బుధవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రదీప్‌ భువనగిరిలో నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని