logo

సామాన్యుల బండి.. సమస్యలు దండి

తక్కువ టిక్కెట్‌ ధరతో.. ఎక్కువ దూరం.. కాలుష్యంలేని వేగవంతమైన ప్రయాణాన్ని అందించే ఎంఎంటీఎస్‌ సేవలు పెరగాల్సింది పోయి.. రానురాను దిగజారుతున్నాయి.

Published : 23 Mar 2023 02:56 IST

ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో తాగునీరూ కరవే
మరుగుదొడ్లకు తాళాలు..  ప్రయాణికుల అవస్థలు

ఫతేనగర్‌ స్టేషన్‌లో..

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ టిక్కెట్‌ ధరతో.. ఎక్కువ దూరం.. కాలుష్యంలేని వేగవంతమైన ప్రయాణాన్ని అందించే ఎంఎంటీఎస్‌ సేవలు పెరగాల్సింది పోయి.. రానురాను దిగజారుతున్నాయి. కేవలం రూ. 5ల టిక్కెట్‌తో 20 కిలోమీటర్లు ప్రయాణించే ఏకైక ప్రజారవాణా వనరుగా.. పేరుతెచ్చుకుని సామాన్యుల బతుకుబండిగా మారిన ఎంఎంటీఎస్‌ సేవలు కనుమరుగవుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఎంఎంటీఎస్‌ రైళ్లు పరుగులుపెట్టే స్టేషన్లు 26 ఉన్నాయి. ఇందులో లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, సీతాఫల్‌మండి, కాచిగూడ మినహా మిగతా వాటిలో తాగునీటితోపాటు ఇతర సౌకర్యాలేవీ కనిపించవు. గతంలో ఐఆర్‌సీటీసీ ఒప్పందం ప్రకారం కేవలం రూ.5లకే లీటరు ఆర్‌వో ప్లాంట్‌ నీళ్లు అందించే వెసులుబాటు అన్ని స్టేషన్లలో ఉండేది. కరోనా తర్వాత ఆ సేవలను పునరుద్ధరించకపోవడంతో నగర ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో తాగునీటికి అల్లాడిపోతున్నారు.


అత్యవసరమన్నా వినరు..

ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లన్నిటిలోనూ మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారు. ఆయా స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందికి అసౌకర్యంగా ఉంటుందని.. వారు మాత్రమే వినియోగించుకునేందుకు వీలుగా తాళాలు కార్యాలయంలో ఉంచుకుంటున్నారు. ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదు. అత్యవసరమై అడిగినా సిబ్బంది తాళాలు తెరవడంలేదు. అవి తమవద్ద లేవని చెబుతున్నారు. రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు ఉన్నవి సిబ్బంది కోసమేగానీ.. ప్రయాణికులకు కాదనే విధంగా ఆయా స్టేషన్ల సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పట్టాల పక్కన మూత్రవిసర్జన చేస్తే రూ.500ల వరకూ పెనాల్టీ వేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

నేచర్‌క్యూర్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లో..


కుళాయి నీళ్లు తాగలేక..

ప్రతి స్టేషన్లో ఆర్‌వో ప్లాంట్‌ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేవారు. ఇందుకు వాటర్‌ వెండింగ్‌ మెషిన్లు ఏర్పాటు చేశారు.. కరోనా తర్వాత ఈ సేవలు పునరుద్ధరించలేదు. గతంలో అరగంటకో రైలు అందుబాటులో ఉండేది.. కరోనా తర్వాత గంటకో రైలులా మారింది. ఎండాకాలంలో గంటల కొద్దీ వేచి ఉండే ప్రయాణికులు దాహంతో అల్లాడిపోవాల్సి వస్తోంది. రైల్వేతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అన్ని స్టేషన్లలో స్టాళ్లు ఏర్పాటు చేయలేదు. లింగంపల్లి, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, బేగంపేట, సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్లలో మినహా మిగతాచోట్ల నీళ్లు కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి. కొన్నిచోట్ల నీళ్ల బాటిల్‌ కోసం పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. దాదాపు  20 స్టేషన్లలో ఇదే పరిస్థితి. కొన్నింటిలో దాతలు అమర్చిన ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు పని చేయడం లేదు. చుట్టుపక్కల వారు నీళ్లు పట్టుకెళ్తున్నారని రైల్వే అధికారులు, సిబ్బంది నల్లాలు బంద్‌ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రూ. 5కే లీటరు తాగునీరు అందిస్తున్న ఐఆర్‌సీటీసీ కౌంటర్లను అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురావాలని, కనీసం వేసవిలోనైనా వీటిని నెలకొల్పాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మొత్తం ఎంఎంటీఎస్‌ సర్వీసులు: 86
నిత్యం ప్రయాణించే వారి సంఖ్య: 94 వేలు
కరోనాకు ముందు సర్వీసులు: 121
ప్రయాణికులు 1.80 లక్షలు
తాగునీరు అందుబాటులో లేని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లు: 20

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని