logo

మెహిదీపట్నం నుంచి బంజారహిల్స్‌కు మరో రోడ్డు

మెహిదీపట్నం నుంచి బంజారా హిల్స్‌ వెళ్లేందుకు మరో దారిని తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. సరోజిని దేవి కంటి ఆస్పత్రి పక్కనున్న రోడ్డును బంజారహిల్స్‌ రోడ్డు నం.12తో కలుపుతూ లింకు రోడ్డును అభివృద్ధి...

Published : 23 Mar 2023 02:56 IST

ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: మెహిదీపట్నం నుంచి బంజారా హిల్స్‌ వెళ్లేందుకు మరో దారిని తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. సరోజిని దేవి కంటి ఆస్పత్రి పక్కనున్న రోడ్డును బంజారహిల్స్‌ రోడ్డు నం.12తో కలుపుతూ లింకు రోడ్డును అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేపట్టారు. సరోజిని దేవి ఆస్పత్రి నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే దారిలో ఎడమవైపు ఖాజా మెన్షన్‌ ఫంక్షన్‌హాల్‌ ఉంటుంది. అక్కడి నుంచి పోలీస్‌ ఆఫీసర్స్‌ మెస్‌, నసేమన్‌ హోటల్‌, ఫస్ట్‌ లాన్సర్‌, అహ్మద్‌నగర్‌ వరకు ఉన్న ప్రస్తుత రహదారిని 60అడుగుల మేర విస్తరించి, అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నం.12 వరకు లింకు రోడ్డును అభివృద్ధి చేయాలని బల్దియా ప్రణాళిక సిద్ధం చేసింది. సంబంధిత తీర్మానాన్ని తాజాగా జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం ఆమోదించి, రహదారి పొడవునా 178 ఆస్తులను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ‘‘పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి వాహనాలు వేగంగా వచ్చి, సరోజిని దేవి కంటి ఆస్పత్రి వద్ద రోడ్డుపైకి దిగుతాయి. టోలిచౌకి, మెహిదీపట్నం, అత్తాపూర్‌ నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే వాహనాలు వాటికి తోడవడంతో.. ఎన్‌ఎండీసీ కూడలి వరకు రోడ్డుపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నం.12కు చేరుకోవాలంటే.. మరో మూడు కూడళ్లను దాటాల్సి ఉంటుంది. లింకు రోడ్డుతో సమస్యకు స్వస్తి చెప్పొచ్చు. ప్రయాణ దూరం 3కి.మీ నుంచి 1.4కి.మీ తగ్గుతుంది.’’అని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. పనులు చేపట్టేందుకు పలు సవాళ్లు ఉన్నాయని, స్థానికుల అభ్యంతరాలు, రాజకీయ అడ్డంకులను దాటుకుని రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని