logo

పోయెను సొమ్ము పలకని టిమ్ము

‘హైదరాబాద్‌కు వచ్చేందుకు రమేష్‌ విజయవాడలో టీఎస్‌ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్‌ కోసం డ్రైవర్‌కు తన డెబిట్‌కార్డు ఇచ్చాడు. ఆయన దాన్ని టిమ్‌(టికెట్‌ ఇష్యూ మెషిన్‌)లో పెట్టి.. స్వైప్‌ చేయగా... ప్రయాణికుడి ఖాతాలో డబ్బు కట్‌ అయినా.. 

Published : 23 Mar 2023 03:04 IST

సాఫ్ట్‌వేర్‌ సమస్యతో  టీఎస్‌ఆర్టీసీ  ప్రయాణికులకు ఇబ్బందులు
ఈనాడు - హైదరాబాద్‌

‘హైదరాబాద్‌కు వచ్చేందుకు రమేష్‌ విజయవాడలో టీఎస్‌ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్‌ కోసం డ్రైవర్‌కు తన డెబిట్‌కార్డు ఇచ్చాడు. ఆయన దాన్ని టిమ్‌(టికెట్‌ ఇష్యూ మెషిన్‌)లో పెట్టి.. స్వైప్‌ చేయగా... ప్రయాణికుడి ఖాతాలో డబ్బు కట్‌ అయినా..  టిమ్‌ నుంచి టికెట్‌ రాలేదు. నగదు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని డ్రైవర్‌ సూచించడంతో రమేష్‌కు ఆగ్రహం వచ్చింది. తన వద్ద నగదు లేదని.. ప్రయాణమెలా అనడంతో వారి మధ్య గొడవ మొదలైంది.’

ది ఒక్క రమేష్‌కు ఎదురైన సంఘటనే కాదు.. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తరచూ ఇలాంటి అనుభవాలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమంతా డిజిటల్‌ చెల్లింపులే. సెల్‌ఫోనే మినీ ఏటీఎంలా, బ్యాంకులా మారిపోయింది. ఎవరి జేబుల్లోనూ పెద్దగా నగదు ఉండడంలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్నా.. అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

టిమ్‌కు సందేశం రాకనే..

టిమ్‌లో కార్డుపెట్టిన తర్వాత డబ్బు కట్‌ అయినా.. ఆ మొత్తం పడిన బ్యాంకు నుంచి టిమ్‌కు సమాచారం చేరడం లేదు. ఆ సమాచారం ఉంటేనే టిమ్‌ నుంచి టికెట్‌ వస్తుంది. దీంతో బస్సు డ్రైవర్లు/కండక్టర్లు డబ్బు చెల్లించి టికెట్లు తీసుకోవాలంటూ ప్రయాణికులకు సూచిస్తున్నారు. కార్డు ద్వారా కట్‌ అయిన సొమ్ము.. ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో తిరిగి జమ అవుతాయంటూ చెబుతున్నారు. అయితే, ఆ సమయంలో తమవద్ద నగదు లేకపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో ఉన్న రూ. వెయ్యిలో రూ.650 ఇలా కట్‌ అయిపోతే.. దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకోవాలన్నా కుదరని పరిస్థితి ఉందని వాపోతున్నారు.

నెట్‌వర్కుతోనే అవస్థలు..

నిత్యం ఇలాంటి సమస్యలు పదుల సంఖ్యలో ఉత్పన్నమవుతున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. టిమ్‌లో కార్డు స్వైప్‌ చేశాక ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ ఖాతాలో డబ్బు జమవుతుంది. ఆ సందేశం టిమ్‌కు చేరుతుంది. బస్సు దూరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నెట్‌వర్క్‌ సరిగా లేకపోతే వెంటనే ఈ సమాచారం వెళ్లడం లేదని ఆర్టీసీ ఐటీ విభాగం సీనియర్‌ మేనేజర్‌ వెంకారెడ్డి చెబుతున్నారు. ఆయా సందర్భాల్లో ప్రయాణికుల కార్డుల నుంచి కట్‌ అయిన మొత్తం.. రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో తిరిగి జమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని