logo

దక్షిణమధ్య రైల్వేకు జలసిరి

జలసంరక్షణకు దక్షిణమధ్య రైల్వే తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సహజవనరులను వినియోగించుకొని కరెంటును పొదుపు చేయడంలోనే కాదు.. పెద్ద ఎత్తున ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి వాన నీటిని ఇంకించడంలోనూ ముందుంది. గతంలో 24 బోగీలున్న రైలును శుభ్రం చేయడానికి 3600ల లీటర్ల నీటిని వినియోగించేవారు.

Published : 24 Mar 2023 02:44 IST

ఏటా పెరుగుతున్న ఇంకుడుగుంతల సామర్థ్యం
కొత్తగా మూడువేలు నిర్మించేందుకు చర్యలు
ఈనాడు - హైదరాబాద్‌

ద.మ. రైల్వే నిర్మించిన ఇంకుడు గుంత

జలసంరక్షణకు దక్షిణమధ్య రైల్వే తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సహజవనరులను వినియోగించుకొని కరెంటును పొదుపు చేయడంలోనే కాదు.. పెద్ద ఎత్తున ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి వాన నీటిని ఇంకించడంలోనూ ముందుంది. గతంలో 24 బోగీలున్న రైలును శుభ్రం చేయడానికి 3600ల లీటర్ల నీటిని వినియోగించేవారు. 12 మంది 6 గంటలు పని చేసేవారు. ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ కోచ్‌ వాషింగ్‌ ప్లాంటుతో కేవలం ఒకరి పర్యవేక్షణలో 1440 లీటర్ల నీటితో పని పూర్తవుతోంది. ఇలా అన్ని విభాగాల్లో 60 శాతం పొదుపును పాటించిందని ద.మ. రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌. రాకేష్‌ తెలిపారు.

వర్షాకాలానికి సర్వం సిద్ధం..

ద.మ.రైల్వే ఏటా వర్షాకాలానికి ముందు జలసంరక్షణపై సమీక్ష ఏర్పాటు చేసి.. పాత ఇంకుడుగుంతలను పునరుద్ధరించడం, కొత్తవి తవ్వించడం చేస్తోంది. ఈ ఏడాది నగరంలోని రైల్వే ఆధీనంలో ఉన్న కార్యాలయాలు, నివాసాలు, శిక్షణ కేంద్రాలు, మెకానిక్‌ షెడ్డులు ఇలా అన్ని చోట్ల 3 వేలకు పైగా కొత్తవి తవ్వాలని.. వాటిలోకి వర్షపు నీరు వెళ్లేందుకు ఇనుప జాలీలను పెట్టేందుకు సిద్ధమౌతోంది.

5 లక్షల లీటర్ల నీటి వినియోగానికి..

సికింద్రాబాద్‌ రైలునిలయం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ కార్యాలయాలు,  వర్కుషాపులు..ఇలా అన్ని భవనాల పై కప్పుల నుంచి జారిపడే వర్షపు నీటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి తోడు రైల్వే నివాసాలు, కార్యాలయ ఆవరణలు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఇంకుడు గుంతలను తవ్వాలని నిర్ణయించింది. వీటి ద్వారా సాలార్‌జంగ్‌ బావి, హెరిటేజ్‌ మెట్ల బావి, జడ్‌ఆర్‌టీఐలోని పాత బావి, ఆలుగడ్డబావిలో 5 లక్షల లీటర్లను ప్రతి రోజు వినియోగించుకునేలా నీటిని ఇంకుడుగుంతల ద్వారా సమకూర్చాలని భావిస్తోంది.


జలసంరక్షణకు తీసుకోనున్న చర్యలు

* 17 పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ.

* రోజుకు 7.2 లక్షల లీటర్ల నీటి వినియోగం

* ఏటా రూ. 5.2 కోట్ల ఆదా

* 34 పాత బోర్లకు పునరుజ్జీవం

* 17.79 హెక్టార్లలో 80 కొత్త నీటి  కుంటల నిర్మాణం

* 39 ఎండిపోయిన కుంటలకు జీవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని