logo

భార్యాభర్తల నకిలీ ఫ్రాంచైజీ దందా

ప్రముఖ వ్యాపార సంస్థల ఫ్రాంచైజీలు తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ దేశవ్యాప్తంగా డబ్బు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం అరెస్టు చేసింది.

Published : 24 Mar 2023 02:44 IST

వివరాలు వెల్లడిస్తున్న స్టీఫెన్‌ రవీంద్ర చిత్రంలో డీసీపీలు

ఈనాడు- హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపార సంస్థల ఫ్రాంచైజీలు తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ దేశవ్యాప్తంగా డబ్బు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం అరెస్టు చేసింది. భార్యాభర్తలు నాయకత్వం వహించే ఈ ముఠా జాతీయ, అంతర్జాతీయ సంస్థల నకిలీ వెబ్‌సైట్లు తయారు చేయించి, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో ఫ్రాంఛైజీలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలు చేస్తోంది. ఈ ముఠాలోని ఆరుగుర్ని గురువారం అరెస్టు చేసి, వారి నుంచి నకిలీ వెబ్‌సైట్ల డేటా, ఏడు ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఐదు సీపీయూలు, చెక్‌ బుక్కులు, డెబిట్‌ కార్డులు, సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీలు కల్మేశ్వర్‌ సింగన్వార్‌, రితిరాజ్‌, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు.

తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు.. బిహార్‌కు చెందిన రాకేశ్‌ కుమార్‌ అలియాస్‌ ఆదిత్య సింగ్‌, సరిత దంపతులు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నోయిడాలో ఒక కార్యాలయం ఏర్పాటుచేశారు. ఫ్రీలాన్స్‌ వెబ్‌సైట్‌ డిజైనర్‌ మహ్మద్‌ ఖలీద్‌ వివిధ సంస్థల వెబ్‌సైట్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా నకిలీవి సృష్టించి రాకేశ్‌కు అందిస్తాడు. నకిలీ వెబ్‌సైట్ల ప్రచారం కోసం యోగేందర్‌ కుమార్‌ను నియమించుకున్నారు. పంకజ్‌ సారస్వత్‌, అర్పిత సింగ్‌, రాకేశ్‌ కుమార్‌ భార్య సరిత టెలీకాలర్లుగా పనిచేస్తున్నారు. కేఎఫ్‌సీ, ఐటీసీ, టాటా, జాకీ తదితర 22 ప్రముఖ సంస్థల ఫ్రాంచైజీల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న ఈ ముఠా హైదరాబాదీని మోసం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాచుపల్లికి చెందిన ఓ వ్యక్తి కేఎఫ్‌సీ ఫ్రాంచైజీ కోసం సంప్రదించగా.. అతని వద్ద రూ.94.95 లక్షలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇద్దరు దంపతులు సహా నిందితులందరినీ అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని