అంతరాయాలకు చెల్లు

రంజాన్‌ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్తు పంపిణీ సంస్థ ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.

Updated : 24 Mar 2023 06:46 IST

విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేలా కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: రంజాన్‌ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్తు పంపిణీ సంస్థ ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. ఈసారి వేసవి ప్రారంభంలో అందునా విద్యుత్తు డిమాండ్‌ క్రమంగా పెరిగే సమయంలో పండగ రావడంతో ఏర్పాట్లు అధికారులకు సవాలుగా మారాయి. వేసవి, పండగ డిమాండ్‌ రెండింటిని తట్టుకునేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని సీఎస్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు తెలిపారు. రంజాన్‌ వేళ హైదరాబాద్‌ సౌత్‌ పరిధిలోని ఆస్మాన్‌ఘడ్‌, బేగంబజార్‌, చార్మినార్‌ డివిజన్లలో హైదరాబాద్‌ సెంట్రల్‌లోని మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌, పహాడిషరిఫ్‌ డివిజన్లలోని సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేసింది. మక్కామసీద్‌, మీరాలం ఈద్గా, మాదన్నపేట ఈద్గా, అక్బర్‌బాగ్‌ ఈద్గా, ఇతర ముఖ్యమైన ప్రార్థన స్థలాల వద్ద ఇంజినీర్లు, ఆపరేషన్‌, మెయింటెన్స్‌ సిబ్బందికి నెలరోజుల పాటూ ప్రత్యేక విధులను వేసింది.

* పాతబస్తీలోని డివిజన్ల పరిధిలో 130 వరకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 160కేవీఏ, 315 కేవీఏ, 500కేవీఏ వరకు ఇందులో ఉన్నాయి. చార్మినార్‌లో అత్యధికంగా 70వరకు ఏర్పాటు చేశారు.

* హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థన మేరకు 46 చోట్లకు గాను ఇప్పటికే 35 చోట్ల డీటీఆర్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

* అంతరాయాలు తలెత్తితే సత్వరం మరమ్మతులకు వీలుగా నైపుణ్యం కలిగిన 70 మందికి పైగా కార్మికులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎల్‌టీ కేబుల్‌, ఏబీ కేబుల్‌ను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

వేసవి డిమాండ్‌ను తట్టుకునేలా..

ప్రస్తుతం విద్యుత్తు డిమాండ్‌ స్థిరంగా ఉంది. ఇటీవల వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గినా.. క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 36 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. నెలాఖరు నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండలు పెరిగేకొద్దీ కరెంట్‌ డిమాండ్‌ పెరుగుతుంది. వేసవి కార్యచరణలో భాగంగా పాతబస్తీ చుట్టుపక్కల డివిజన్ల పరిధిలోని ఆరు డివిజన్లలో లోడును తట్టుకునేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 300 వరకు డీటీఆర్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌లోనే వందకు పైగా ఉన్నాయి. 100కేవీఏ నుంచి 500కేవీఏ సామర్థ్యం కల్గిన ట్రాన్స్‌ఫార్మర్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని