logo

‘స్వప్నలోక్‌’పై తేల్చని యంత్రాంగం

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్సుపై అధికార యంత్రాంగం ఎటూ తేల్చట్లేదు. మార్చి 16న కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు అమాయకులు మృత్యువాతపడ్డారు.

Published : 24 Mar 2023 02:40 IST

ఆందోళనలో దుకాణాల యజమానులు

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్సుపై అధికార యంత్రాంగం ఎటూ తేల్చట్లేదు. మార్చి 16న కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు అమాయకులు మృత్యువాతపడ్డారు. దుర్ఘటన జరిగి వారమైనా  భవన నిర్మాణంపై ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకోలేకపోతోంది. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకున్నప్పటికీ, కాంప్లెక్సులోని సుమారు 170 దుకాణాలు మూత పడ్డప్పటికీ, వందలాది మంది ఉపాధిపై ప్రభావం చూపుతున్నా..  పోలీసులు, ఫోరెన్సిక్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీరెవరంటే.. మీరెవరంటూ వాగ్వాదం..

భవనం ఐదు, ఆరు అంతస్తుల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని స్లాబులు, గోడలు దెబ్బతిన్నాయనే అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. పిల్లర్లు, స్లాబులోని కాంక్రీటు నమూనాలను తీసుకునేందుకు బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం అధికారులు, జేఎన్‌టీయూ నిపుణులు కలిపి మొత్తం పది మంది అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అంతస్తుల్లోకి చేరుకున్నారు. అయితే.. అప్పటికే అక్కడ ఫోరెన్సిక్‌ పరీక్షల అధికారులు ఉన్నారు. ఆ సమయంలో మీరెవరంటే.. మీరెవరంటూ ఫోరెన్సిక్‌, బల్దియా అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మీపై కేసు నమోదు చేస్తామని ఫోరెన్సిక్‌ అధికారులు తమను బెదిరించారని బల్దియా యంత్రాంగం వాపోయింది. గొడవ పెద్దగా మారుతుండటంతో.. స్థానిక పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పారు. దాంతో.. పోలీసులు అనుమతించినప్పుడే భవనం పటిష్టతను పరీక్షిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ జాప్యంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని కాంప్లెక్సులోని దుకాణాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ బాధ్యతలను వేగంగా పూర్తి చేసి, నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని