logo

ఖాతాదారు వివరాలు చౌర్యం.. ఆపై సైబర్‌ మోసం

బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం కొట్టేసి.. క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌, రెన్యువల్‌ పేరిట డబ్బు కొల్లగొడుతున్న సైబర్‌ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టుచేశారు.

Published : 24 Mar 2023 02:40 IST

ఈనాడు- హైదరాబాద్‌: బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం కొట్టేసి.. క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌, రెన్యువల్‌ పేరిట డబ్బు కొల్లగొడుతున్న సైబర్‌ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దిల్లీ కేంద్రంగా మోసాలు చేస్తున్నారు. డీసీపీలు కల్మేశ్వర్‌ సింగెనవార్‌, రితిరాజ్‌, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌తో కలిసి సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. యూపీకి చెందిన కఫిల్‌ అహ్మద్‌.. మహ్మద్‌ జమాల్‌, మహ్మద్‌ అసిఫ్‌, చిరాగ్‌తో కలిసి దిల్లీలో నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేశాడు. నోయిడాలోని టెక్‌ మహీంద్రాలో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే వీరేంద్ర సింగ్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కొత్త కార్డుల యాక్టివేషన్‌ విభాగంలో తృతీయ పక్షం కింద సేవలు అందిస్తున్నాడు. ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేని విభాగంలో పనిచేసే వీరేంద్ర క్రెడిట్‌ కార్డుల దరఖాస్తుదారులు, వినియోగదారుల సమాచారాన్ని తన ఫోన్‌తో ఫొటో తీసేవాడు. వీటిని కఫిల్‌కు పంపి ఒక్కో వ్యక్తి వివరాలకు రూ.10-20 చొప్పున వసూలు చేసేవాడు. వొడాఫోన్‌ పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో గతంలో పనిచేసిన ఆకా నిర్వాన్‌ ఒక్కోటి రూ.800 చొప్పున ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌లు, ఇతరుల బ్యాంకు ఖాతాల్ని కఫిల్‌ అహ్మద్‌కు సమకూర్చేవాడు. మాట్రిక్స్‌ ఆస్టస్‌ గ్రూపులో పనిచేసే వికాస్‌ పూరి, అతీత్‌దాస్‌.. ఎస్‌బీఐ, బీవోబీ, ఆర్బీఎల్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు, రుణ దరఖాస్తుల వివరాలు చోరీచేసి ప్రదీప్‌ వాలియాకు ఇచ్చేవారు. అతడు కఫిల్‌కు అమ్మేస్తాడు.

కొట్టేసిన సమాచారంతో మోసాలు... ప్రదీప్‌ వాలియా, వీరేంద్ర సింగ్‌ నుంచి క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల సమాచారం కొనుగోలు చేసే కఫిల్‌ అహ్మద్‌ ఆ వివరాలతో ఆయా వ్యక్తులకు ఫోన్లు చేయించేవాడు. మహ్మద్‌ జమాల్‌, మహ్మద్‌ అసిఫ్‌, చిరాగ్‌ బ్యాంకు ప్రతినిధుల తరహాలో నమ్మకంగా మాట్లాడేవారు. ఖాతా యాక్టివేషన్‌, ఇతర సేవల పేరుతో మాట్లాడి డబ్బు వసూలుచేసేవారు. కొల్లగొట్టిన సొత్తు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తారు. ఈ సొమ్మును కఫిల్‌, ఆకాశ్‌ నిర్వాన్‌ తీసుకునేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు