logo

పరిశీలనలోనే వినతులు.. మంజూరుకు ఎదురుచూపులు

జిల్లాలోని పేద, నిరుపేద కుటుంబాలు అధికశాతం ప్రభుత్వ రేషన్‌ బియ్యం, ఇతర సరకులపైనే ఆధార పడతారు. ఎప్పటికప్పుడు కొత్త కార్డులు మంజూరైతే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు.

Published : 25 Mar 2023 02:21 IST

అధికారుల వద్ద 10 వేల దరఖాస్తులు
న్యూస్‌టుడే, పూడూరు

మీర్జాపూర్‌లో రేషన్‌ బియ్యం పంపిణీ

జిల్లాలోని పేద, నిరుపేద కుటుంబాలు అధికశాతం ప్రభుత్వ రేషన్‌ బియ్యం, ఇతర సరకులపైనే ఆధార పడతారు. ఎప్పటికప్పుడు కొత్త కార్డులు మంజూరైతే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు. ఏళ్లుగా వీటి విషయంలో అధికారులు తగిన దృష్టి సారించడంలేదు. ఫలితంగా మంజూరు కోసం ఎదురు చూడటమే సరిపోతోంది. కార్డు నుంచి కొందరి పేర్లు అకారణంగా తొలగించటంతో తిరిగి నమోదు చేసుకునేందుకు అవకాశం లేక కొందరు ఎదురు చూస్తున్నారు. మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా జిల్లాలోని పరిగి, కొడంగల్‌, తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో సుమారు 10 వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

సరకుల పంపిణీ డీలా..

* జిల్లా వ్యాప్తంగా 588 మంది రేషన్‌ డీలర్లు ఉండగా ఆయా దుకాణాల పరిధిలో 2.41 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులున్నాయి. ప్రతినెల 4,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాలున్నాయి. మొత్తం జనాభా 9.5 లక్షలకు పైగా ఉంటే వీరిలో 2 లక్షల మంది రైతులు ఉన్నారు. మిగిలిన వారిలో పేదలు, కూలీలు ఎక్కువ.
* గ్రామాల్లో ఒకటో తేదీ నుంచి 15 వరకు సరకులు ఇవ్వాల్సి ఉండగా తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ప్రస్తుతం ఉచిత బియ్యం పంపిణీ అమలవుతోంది.
* పౌర సరఫరాల గోదాంల నుంచి బియ్యం గ్రామాలకు సకాలంలో చేరుకోవటం లేదు. దీంతో ప్రతినెల కచ్చితమైన తేదీ చెప్పలేక డీలర్లు వచ్చినప్పుడు లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఒక్కో నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ- పోస్‌ విధానంలో ఇవ్వాల్సి ఉండటంతో కొన్ని గ్రామాల్లో సిగ్నల్స్‌ సమస్య మూలంగా సరకులు ఇవ్వటంలో కొంత జాప్యం జరుగుతోంది.
* గతంలో బియ్యంతో పాటు పేదలకు చింతపండు, మంచినూనె ప్యాకెట్‌, ఉప్పు, గోధుమలు, చక్కెర, కిరోసిన్‌ ఇచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర వస్తువులకు స్వస్తి చెప్పటంతో కేవలం బియ్యంతో సరిపెడుతున్నారు.
* పూడూరు మండలం కంకల్‌కు చెందిన యువకుడు గాండ్ల సురేశ్‌ (44) వ్యవసాయ కూలీ సొంతంగా పొలం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. రేషన్‌ కార్డు మంజూరు కోరుతూ అర్జీ పెట్టుకున్నా మోక్షం కలగలేదు. జిల్లాలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.


ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి

రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

జిల్లాలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన వారికి మంజూరు కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు. దరఖాస్తులు పై అధికారుల పరిశీలనలో ఉన్నాయి. పేర్లు తొలగినా తిరిగి నమోదుకు కూడా అవకాశం లేదు. ప్రతినెల బియ్యం పంపిణీలో జాప్యం జరగకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని