logo

తీర్పు అమలు గడువు దాటితే.. జైలుకే!

తీర్పులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సంస్థలపై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ కొరడా ఝుళిపిస్తోంది.

Published : 27 Mar 2023 01:33 IST

ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్లు వేస్తున్న వినియోగదారులు

ఈనాడు, హైదరాబాద్‌: తీర్పులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సంస్థలపై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ కొరడా ఝుళిపిస్తోంది. ఫిర్యాదుదారుల నుంచి వస్తున్న ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లను విచారిస్తూ సదరు సంస్థల ప్రతినిధులకు జైలుశిక్ష విధిస్తోంది. తాజాగా ఓ కేసులో తేజ బెనిఫిట్‌ ఫండ్‌ ఎండీ బి.హరికృష్ణకు కమిషన్‌-2 ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. సేవాలోపంపై సైదాబాద్‌ కాలనీకి చెందిన ఎన్‌.మేనక కేసు దాఖలుచేయగా.. విచారించిన కమిషన్‌ 2018 జూన్‌లో తీర్పు వెలువరించింది. రూ.8.25 లక్షల పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులుగా చెల్లించాలని తేజ బెనిఫిట్‌ ఫండ్‌ సంస్థను ఆదేశించింది. ప్రతివాద సంస్థ అప్పీలుకెళ్లగా.. జిల్లా కమిషన్‌ తీర్పును రాష్ట్ర కమిషన్‌ సమర్థిస్తూ అప్పీలు కొట్టివేసింది. కొంతసొమ్ము చెల్లించాక ప్రతివాది మొండికేయడంతో ఫిర్యాదీ ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. విచారణ సాగగా..వాదనల అనంతరం ఆర్నెల్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష అమలు నిలిపివేతకు సంబంధించి నెల గడువు ముగిసినా ఉత్తర్వులు సమర్పించనందున కమిషన్‌ ప్రతివాదిని జైలుకు పంపుతూ ఆదేశాలిచ్చింది.

ఈ తరహా కేసులోనే సన్‌షైన్‌ ఇన్‌ఫ్రా యజమాని ప్రవీణ్‌కుమార్‌ అరెస్టయ్యారు. ఇంటి నిర్మాణం విషయంలో నాగోలుకు చెందిన ఎం.విశ్వేశ్వర్‌రావుకు ప్రతివాద సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంతో కమిషన్‌-2ను ఆశ్రయించగా రూ.2,60,000, 9శాతం వడ్డీతో, రూ.5వేలు కేసు ఖర్చులు చెల్లించాలని తీర్పు వెలువరించింది. గడువులోగా తీర్పు అమలుచేయలేదంటూ విశ్వేశ్వర్‌రావు ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నోటీసులు పంపినా ప్రవీణ్‌కుమార్‌ పట్టించుకోకపోవడంతో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీఅయింది. కమిషన్‌ ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు పంపింది.

హైదరాబాద్‌లోని మూడు కమిషన్లు, రంగారెడ్డిజిల్లా కమిషన్లలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి వారం చాలా తీర్పులు వెలువడుతున్నాయి. నష్టపరిహారం, రీఫండ్‌, కేసు ఖర్చులు చెల్లించేందుకు ప్రతివాదులకు 30 నుంచి 45 రోజుల సమయాన్ని ఇస్తూనే.. గడువుదాటితే ఆ మొత్తానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కమిషన్లు ముందే హెచ్చరిస్తున్నాయి. పరిహారం చెల్లించేందుకు కొన్ని సంస్థల ప్రతినిధులు మొండికేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కమిషన్లు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని