TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ రెండో రోజు విచారణ చేపట్టనుంది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్, డాక్యనాయక్‌, రాజేశ్వర్‌ను సుదీర్ఘంగా విచారించి అధికారులు కీలక విషయాలను రాబట్టనున్నారు.

Published : 27 Mar 2023 10:14 IST

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను సిట్‌ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యానాయక్, రాజేశ్వర్‌ను సుదీర్ఘంగా విచారించి వారి నుంచి కీలకమైన విషయాలను రాబట్టనున్నారు. సీసీఎస్‌ నుంచి సిట్‌ కార్యాలయానికి నిందితులను తరలించి విచారించనున్నారు. 

ఆదివారం సిట్‌ విచారణలో డాక్యా నాయక్‌, రాజేశ్వర్‌ను హైదరాబాద్‌లో బస చేసిన హోటల్‌కి తీసుకువెళ్లి అధికారులు వివరాలు సేకరించారు. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులనూ సిట్‌ పోలీసులు నిన్న విచారించారు. వివిధ జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకులను హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయంలో రెండో రోజు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని అదుపులో తీసుకొని సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

నాంపల్లి కోర్టులో విచారణ..

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్‌, ఏ5 కేతావత్‌ రాజేశ్వర్‌లను కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు వీరిని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురు నిందితులు ఏ-10 షమీమ్‌, ఏ-11 సురేశ్‌, ఏ-12 రమేశ్‌ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేయగా.. నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ముగ్గురు నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరింది. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారించి నేడు తీర్పు వెలువరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని