TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ. . మరో వ్యక్తి అరెస్టు

టీఎస్‌పీఎస్పీ పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. రేణుక భర్త డాకియా ద్వారా ప్రశ్నాపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 27 Mar 2023 18:09 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.  రేణుక భర్త డాకియా ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఆ ప్రశ్నాపత్రాన్ని రాజేందర్‌కు విక్రయించినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 15కి చేరింది.  మరోవైపు, ఏఈ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంతో సమాంతరంగానే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీ అంశంపై సిట్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌ రెడ్డి తన బావ ప్రశాంత్‌కు విక్రయించగా.. అతడు న్యూజిలాండ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రాసినట్టు నిర్థారించుకున్నారు. ఈ పరీక్షలో ప్రశాంత్‌కు 100కు పైగా మార్కులు వచ్చినట్టు గుర్తించారు. అయితే, నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ప్రశాంత్‌కు సిట్‌ అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. 

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ అధికారులు ఓ వైపు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తూనే మరోవైపు, 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను పిలిచి విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ అధికారుల నుంచి వారి సమాచారం సేకరించి ఇప్పటివరకు 60మందికి పైగా అభ్యర్థులను పిలిచి విచారించగా.. మరికొందరిని ఫోన్‌లో సంప్రదించినట్టు సమాచారం. వీరిలో అనేకమంది అభ్యర్థులు చాలా సార్లు ప్రిలిమ్స్‌ రాయడం, ఎప్పటి నుంచో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారే ఉన్నట్టు తేలినట్టు తెలుస్తోంది. అయితే, అనుమానాస్పదంగా అనిపించిన వ్యక్తులను మాత్రం పిలిచి విచారిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని