వడదెబ్బను తప్పించుకుందాం

జ్వరం, తలనొప్పి, వాంతులతో ఇటీవల ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎండలో తిరిగే వారికి వడగాల్పులు కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.

Updated : 28 Mar 2023 07:18 IST

ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆసుపత్రులకు బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌: జ్వరం, తలనొప్పి, వాంతులతో ఇటీవల ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎండలో తిరిగే వారికి వడగాల్పులు కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రి ఓపీకి నిత్యం ఇలాంటి లక్షణాలతో 200మంది వస్తున్నారు. ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి. రానున్న రోజుల్లో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు.  

లక్షణాలు ఇవి..

* కండరాల తిమ్మిరిః వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

*  తీవ్రంగా చెమటలు

*  తలనొప్పి, వాంతులు

* అధిక దాహం 

*  అధిక హృదయ స్పందనలు 

* ముదురు రంగులో మూత్రం  

ఎవరికి ముప్పు ఎక్కువంటే..

* పిల్లలు, శిశువులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు *  అధిక శారీరక శ్రమ చేసేవారు

* గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు

* బీపీ,  డిప్రెషన్‌కు మందులు వాడేవారు 

* అతిగా మద్యం తీసుకునేవారు


జాగ్రత్తలు పాటించాలి..
- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి. ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి.

* ఆల్కాహాల్‌ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

* ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి.

* వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి.  

* వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది.. బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని