logo

ప్రజాధనానికి టెండర్‌

అభివృద్ధి, నిర్వహణ పనులకు ఇంజినీర్లు రూపొందిస్తున్న అంచనా వ్యయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిర్ణయించిన దానికంటే, 60 శాతానికిపైగా తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారులు ముందుకొస్తుండటమే ఇందుకు నిదర్శనం.

Published : 28 Mar 2023 03:36 IST

పనుల అంచనా వ్యయం నిర్ధారణలో ఇంజినీర్ల చేతివాటం
ధరలో 40 శాతానికే పని చేస్తామంటున్న గుత్తేదారులు

ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధి, నిర్వహణ పనులకు ఇంజినీర్లు రూపొందిస్తున్న అంచనా వ్యయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిర్ణయించిన దానికంటే, 60 శాతానికిపైగా తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారులు ముందుకొస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఇంజినీర్లు అంచనా వ్యయాన్ని భారీ పెంచడంతోపాటు చిన్న పనులకు సైతం అధిక నిధులతో ప్రతిపాదనలను రూపొందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

నాణ్యతకు తిలోదకాలు..

సాధారణంగా ఏదైనా టెండరు ప్రక్రియలో అంచనా వ్యయానికి 5 శాతం తక్కువ.. ఐదు శాతం ఎక్కువకు పనిచేస్తామంటూ గుత్తేదారులు టెండరులో పాల్గొంటారు. జీహెచ్‌ఎంసీలో మాత్రం 60 శాతానికిపైగా తక్కువ అంచనా వ్యయంతో నిర్వహణ పనులు చాలాకాలంగా జరుగుతున్నాయి. అన్ని సర్కిళ్లలో ఈ సమస్య ఉన్నప్పటికీ.. పాతబస్తీలో కొంత ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల చార్మినార్‌ జోన్‌లో శ్మశాన వాటిల్లో చెట్లను తొలగించి, గోడలకు సున్నం వేసే పనులను 60 శాతానికిపైగా లెస్‌కు దక్కించుకున్నారు. పూడికతీత, పండుగల సమయాల్లో విద్యుద్దీపాలు, వేదికల ఏర్పాటు తదితర పనులకు టెండర్లు పిలిస్తే.. 60 శాతానికిపైగా తక్కువ ఖర్చుతో పని చేస్తామంటున్నారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారులు.. నామమాత్రపు ఖర్చుతో చేసే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.  

ఇవిగో ఉదాహరణలు..

సంతోష్‌నగర్‌ కుర్మగూడ భానునగర్‌లోని అంబియా, మదీన మసీదుల సమీపంలోని శ్మశానవాటికల్లో చెట్లు తొలగించి, గోడలకు సున్నం వేసే పనులను 60.20 శాతం తక్కువ ధరకు గుత్తేదారు దక్కించుకున్నారు. అదే డివిజన్‌లో మహమ్మదీయ మసీదు శ్మశాన వాటికలో 60.76 శాతం తక్కువకు, డైమండ్‌ స్వీట్‌ షాపు వెనక, రెయిన్‌ బజార్‌ చమాన్‌ ఎదురుగా, రజాతుల్‌ హదీస్‌ మసీదు వద్ద ఉన్న గ్రేవ్‌ యార్డులో రూ.60.76 శాతం తక్కువకు పనులు దక్కించుకున్నారు. బాగ్‌ ఖాదిర్‌ ఉద్‌ దావ్లా, యసీన్‌ బేగం మసీదుల వద్ద శ్మశాన వాటిక నిర్వహణ పనులను 60.76 శాతం తక్కువకు, సలార్‌ ఉల్‌ ముల్క్‌ మసీదు, మసీదు గ్రేవ్‌ యార్డు పక్కనున్న శ్మశానవాటికలో 60.1 శాతం తక్కువకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని