ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌పై అనర్హత: అశోక్ చవాన్

లోక్‌సభలో రాహుల్‌ గాంధీ అదానీ అక్రమాలను బయటపెట్టినందుకే ఆయనపై అనర్హత వేటు వేశారని మహారాష్ట్ర  మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ విమర్శించారు.

Published : 28 Mar 2023 18:20 IST

హైదరాబాద్‌: దేశప్రజల దృష్టి మరల్చేందుకే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనా ఆక్రమణ లాంటి ఎన్నో సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా అధికార పార్టీ.. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అదానీ అక్రమాలపై లోక్‌సభలో రాహుల్‌ ప్రశ్నిస్తే  మైక్ కట్ చేశారని, అదానీ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై కేంద్రం దగ్గర సమాధానం లేదని ఆరోపించారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ నిధులను కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చవాన్‌ మాట్లాడారు.

‘‘ ప్రజా సమస్యలపై లోక్‌సభలో మాట్లాడనీయరు. మోదీ నియంత పోకడలను సహించబోము. ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంది. అందుకే కుట్రపూరితంగా రాహుల్‌పై అనర్హత వేటు వేశారు. రాహుల్‌ లోక్‌సభలో అదానీ అక్రమాలు బయపెట్టగానే పాత కేసును తెరమీదికి తెచ్చారు. రాహుల్‌ గాంధీ ఓబీసీలను అవమాన పరిచారని, భాజపా గగ్గోలు పెడుతోంది. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారా? మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌ను డిస్‌ క్వాలిఫై చేశారు.’’ అని చవాన్‌ విమర్శించారు.

రాహుల్‌పై అనర్హత వేటు దేశంలో పెరుగుతున్న నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌కు విఘాతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను అడ్డుకుంటాం. యూఎస్‌, శ్రీలంకలో రాజకీయ నేతలపై పరువు నష్టం దావాలు ఎత్తివేశారు. మన దేశంలోనూ అదే జరగాలి. ప్రత్యర్థుల రాజకీయ ప్రసంగాలపై  పరువునష్టం కేసులు ఉండకూడదు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. దాని పరిరక్షణ కోసం ప్రజల్లోకి వెళ్తాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయ పోరాటాలతో పాటు ప్రజా పోరాటం చేస్తాం.’’ అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లోకి భారాస ప్రవేశించడాన్ని ఆయన స్వాగతించారు. భారాస అధ్యక్షుడు కేసీఆర్‌.. భాజపాకి వ్యతిరేకంగా పని చేస్తున్నారో? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అయితే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్‌ ఖండించారని, దీనిని స్వాగతిస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని