CM KCR: ‘గృహలక్ష్మి’ విధివిధానాలు ఖరారు చేయండి: కేసీఆర్‌

అర్హులైన పేదలకు ‘గృహలక్ష్మి’పేరిట రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో సీఎం శాంతికుమారితోపాటు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Updated : 28 Mar 2023 19:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని (Santhi kumari) ఆదేశించారు. ప్రధానంగా వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న కేసీఆర్‌.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ‘గృహలక్ష్మి’ పేరుతో రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైని విధివిధానాలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎస్‌తోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం.. అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి  1.55 లక్షల  మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్  బుక్‌లు ముద్రించి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన జరగనున్న భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణ కోసం సీఎం తన ప్రత్యేక నిధి నుంచి రూ. కోటి మంజూరు చేశారు. కరోనా కారణంగా  రెండేళ్లుగా భద్రాచలం  దేవస్థానం ఆదాయాన్ని కోల్పోందన్న దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్ననట్లు చెప్పారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని