logo

మెట్రో రెండోదశ విస్తరణం

మెట్రోరైలు రెండోదశకు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది.

Updated : 29 Mar 2023 09:38 IST

కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల కాక

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు రెండోదశకు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. అసలు రాష్ట్రం కేంద్రాన్ని ఏం కోరింది? అందుకు కేంద్రం ఏం సమాధానమిచ్చింది? అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి.

* 2022 అక్టోబరు 27న మెట్రో రెండోదశ(బి) బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌(26కి.మీ.), నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌(5 కి.మీ.) మార్గాల డీపీఆర్‌, ఇతర పత్రాలను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ కేంద్రానికి సమర్పించారు. అనుమతిస్తూ నిధులు మంజూరు చేయాలని కోరారు.

* 2022 నవంబరు 14న రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మెట్రోరైలు రెండోదశ(బి)ను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం వాటాతో సంయుక్త ప్రాజెక్ట్‌గా చేపట్టేందుకు అనుమతిస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరికి లేఖ శారు.

* సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)ను అధ్యయనం చేసిన కేంద్రం 14 అంశాలపై తమ పరిశీలనలను రాష్ట్ర పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు డిసెంబరు1, 2022న పంపింది. సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ సహచట్టం కింద కేంద్రానికి దరఖాస్తు చేయగా కేటీఆర్‌ రాసిన లేఖ, కేంద్రం లెవనెత్తిన సందేహాలు, పరిశీలన లేఖలు బయటికి వచ్చాయి. ఈ లేఖల్లో లేెవనెత్తిన అంశాలన్నీ సాంకేతికత పరమైనవని.. ఇప్పటికే సమాధానమిచ్చామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ‘ఈనాడు’తో అన్నారు. ఇంకా కొన్ని పత్రాలు లేవని కేంద్రం అంటోందని.. వాటిని సైతం మళ్లీ పంపనున్నట్లు అధికారులు తెలిపారు.


కేంద్ర ప్రధాన పరిశీలనలు.. రాష్ట్రం సమధానాలివి

కేంద్రం పరిశీలన: నవంబరు 2018 ధరల ప్రకారం డీపీఆర్‌ రూపొందించారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 2019లో వచ్చాయి. ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రకారం సవరించి(అప్‌డేట్‌)న డీపీఆర్‌ను పంపించండి.

రాష్ట్రం సమాధానం: సవరించిన ధరలతో డీపీఆర్‌ను అప్‌డేట్‌ చేసి ఇప్పటికే పంపించాం.

కేంద్రం పరిశీలన: ప్రత్యేక సంస్థ ఏర్పాటు ఉండాలి(ఎస్‌పీవీ)

రాష్ట్రం సమాధానం: ఇప్పటికే మెట్రోకి సంబంధించి రెండు ఎస్‌పీవీలు ఉన్నాయి. మీరు ఆమోదిస్తే వీటిలో ఒకదాన్ని ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌పీవీగా మారుస్తాం.

కేంద్రం పరిశీలన: ప్రాజెక్ట్‌ వ్యయంలో కంటిన్‌జెన్సీ కింద 3 శాతం అన్నింటి మీద లెక్కకట్టారు. కొన్నింటికే ఇది వర్తిస్తుంది.

రాష్ట్రం సమాధానం: కేంద్రం అభ్యంతరాల మేరకు అనుమతి ఇచ్చిన వాటి వరకు కంటిన్‌జెన్సీ వర్తించేలా మార్పులు చేసి పంపించాం. (తెలియని ఖర్చుల కోసం కేటాయించే మొత్తాన్ని కంటిన్‌జెన్సీ కింద చెబుతుంటారు).

కేంద్రం పరిశీలన: 2020లో ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రకారం ప్రాజెక్ట్‌లో వాడే సామగ్రి దేశీయ ఉత్పత్తుల వాటా నిర్ణీత స్థాయిలో ఉండాలి.

రాష్ట్రం సమాధానం: ఆ మేరకు చేస్తున్నాం.

కేంద్రం పరిశీలన: ప్రతిపాదిత విస్తరణ మార్గంలో రద్దీ సమయంలో రైడర్‌షిప్‌ అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌కు న్యాయం చేయలేరు. దీనికి సప్లిమెంట్‌ చేయడానికి ఇతర విధానాలలో కానీ, ఫీడర్‌ సర్వీసులు కానీ ఉండాలి. వాటి ప్రణాళికలు, కారిడార్ల ప్రతిపాదనలు పంపండి.

రాష్ట్రం సమాధానం: నిర్దేశిత ప్రయాణాల సగటు కంటే రెండోదశలో రైడప్‌షిప్‌ ఎక్కువే ఉంది.

కేంద్రం పరిశీలన: మెట్రోపాలసీ 2017 ప్రకారం తప్పనిసరిగా యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి.

రాష్ట్రం సమాధానం: రాష్ట్రంలో ఇప్పటికే యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని