logo

వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం తిరుగుజలాలు

శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం భగీరథ పథకం ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈలు, డీఈలు తదితరులు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు భగీరథ పథకం దగ్గర నీటి సరఫరా సమీక్షించారు.

Published : 29 Mar 2023 02:21 IST

వేసవిలో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం
న్యూస్‌టుడే, కొల్లాపూర్‌

ఎల్లూరు జలాశయం వద్ద భగీరథ ప్లాంటు

శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం భగీరథ పథకం ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈలు, డీఈలు తదితరులు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు భగీరథ పథకం దగ్గర నీటి సరఫరా సమీక్షించారు. ప్రధానమైన రేగుమాన్‌గడ్డ తీరంలో 808.80 అడుగుల మేరకే శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పథకం అధికారులు తగినంత ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులున్నాయి.

విద్యుదుత్పత్తి నిలిపివేస్తేనే..

ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో శ్రీశైలం, నాగర్జునసాగర్‌ ప్రాజెక్టుల ప్రాంతంలో విద్యుదుత్పత్తి నిలిపివేస్తే కొంతవరకైనా తిరుగుజలాలు నిల్వ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తికి ప్రతి రోజు 2,500 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 531 అడుగుల లెవల్‌లో నీళ్లు నిల్వ ఉన్నాయి. గతేడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ చేసి 4 టీఎంసీల నీటిని వెనకకు తీసుకొచ్చారు. అప్పట్లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 540 అడుగుల నీళ్లు నిల్వ ఉండటం వలన రివర్స్‌ పంపింగ్‌ సాధ్యమైంది. ఈ వేసవిలో సాగర్‌ ప్రాజెక్టులోనే నీటి నిల్వ తగ్గిపోతోంది. దీనివలన రివర్స్‌ పంపింగ్‌కు కూడా ఇబ్బందులు నెలకొన్నాయి.

6 జిల్లాల పరిధిలో..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు జలాశయం వద్ద మిషన్‌ భగీరథ పథకం నుంచి నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 19 పురపాలికలు, 4 వేలకు పైగా గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉంది. రోజు 632 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతం ఎంజీ కేఎల్‌ఐలోని ఎల్లూరు రేగుమాన్‌గడ్డ తీరంలో శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోవడం వలన ఇబ్బందులు నెలకొన్నాయి. దీనికి తోడు ఎల్లూరు జలాశయం కేవలం 0.35 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటంతో వేసవిలో 4 నెలలు తాగునీటికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అధికారులు ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ప్రస్తుతం శ్రీశైలం తిరుగుజలాల నిల్వ, ఎల్లూరు భగీరథ పథకం వద్ద నీటి నిల్వ పరిస్థితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని