logo

యాచనకు పసివాడి కిడ్నాప్‌

ఏడాదిన్నర బాలుడు.. అమ్మమ్మ పొత్తిళ్లలో ఆదమరచి నిద్రపోతున్నాడు. నలుగురు అగంతకులు ఆ చిన్నారిని కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు

Updated : 30 Mar 2023 04:16 IST

అంబులెన్స్‌ డ్రైవర్‌ చొరవతో నిందితుల పట్టివేత

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు (కుడి నుంచి ఎడమకు)

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ఏడాదిన్నర బాలుడు.. అమ్మమ్మ పొత్తిళ్లలో ఆదమరచి నిద్రపోతున్నాడు. నలుగురు అగంతకులు ఆ చిన్నారిని కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు. పిల్లాడిని తీసుకెళ్తుండగా అంబులెన్స్‌ డ్రైవర్‌ గమనించి అడ్డుకోవటంతో సురక్షితంగా తిరిగి అయినవాళ్ల ఒడికి చేరాడు. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగిన ఈ టన కలకలం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్‌ జి.నరేష్‌, ఎస్సై కిషోర్‌ తెలిపిన వివరాల మేరకు.. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారానికి చెందిన హారతి ఆరోనెల గర్భంతో మూడు నెలల క్రితం గాంధీఆసుపత్రిలో చేరారు. తోడుగా భర్త సాయి.. కుమారుడు శ్యామ్‌(ఏడాదిన్నర)తో కలిసి అక్కడేఉంటూ సపర్యలు చేస్తున్నాడు. హిమాయత్‌నగర్‌లోని హారతి సోదరుడు రాజేందర్‌గౌడ్‌ వారి బాగోగులు చూస్తున్నాడు. మూడ్రోజుల క్రితం హారతికి మగపిల్లాడు పుట్టాడు. ఆమె తల్లి పాపమ్మ ఆసుపత్రికి వచ్చింది. అప్పటినుంచి పాపమ్మ, సాయి, శ్యామ్‌ ఆసుపత్రి ప్రాంగణం, మెట్రోపిల్లర్ల పక్కన రాత్రిళ్లు నిద్రపోతున్నారు. ఈనెల 27న రాత్రి వార్డులో భార్యకు సాయి తోడు ఉండగా, మెట్రోపిల్లర్‌ వద్ద మనువడితో కలిసి పాపమ్మ నిద్ర పోతున్నారు. తెల్లవారుజామున 3గంటల వేళ ముగ్గురు మహిళలు, ఒక యువకుడు పాపమ్మ పక్కనే నిద్రపోతున్న శ్యామ్‌ను ఎత్తుళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని సమీపంలోని అంబులెన్స్‌ నుంచి డ్రైవర్‌ నవీన్‌ గమనించాడు. నలుగురు పిల్లాడితో పారిపోతుండగా బిగ్గరగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారంతా చేరి వారిని పట్టుకుని బిడ్డను కాపాడారు. నిందితులను ఆసుపత్రిలోని పోలీస్‌ ఔట్‌పోస్టులో అప్పగించారు. దర్యాప్తులో ఆ నలుగురు బన్సీలాల్‌పేట, బోయిగూడకు చెందిన తల్లీకొడుకులు పిల్లి గాయత్రి(50), వీరాంజన్‌(26), బట్టు విజయ(40), కె.పుష్ప(42)గా గుర్తించారు. వీరంతా నిలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. పిల్లాడిని ఎత్తుకెళ్లి యాచనలో పెట్టాలనుకున్నామని విచారణలో చెప్పడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని