logo

క్షణికావేశం.. మనస్తాపం.. బలవన్మరణం

భార్యతో తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

Published : 30 Mar 2023 02:04 IST

 భర్త పురుగు మందు తాగాడని... భార్య ఆత్మహత్య
కుమార్తె మృతి చెందిందని ఉరేసుకున్న తల్లి

షాబాద్‌, న్యూస్‌టుడే: భార్యతో తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తన వల్లే భర్త అలా చేశాడని భార్య మనస్తాపంతో ఉరేసుకోగా...తన కుమార్తె కాపురం ఇలా అయ్యిందే అని ఆవేదనతో.. ఆమె తల్లి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటనలు బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువయ్యగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు...హైతాబాద్‌ గ్రామానికి చెందిన మల్లేష్‌, యాదమ్మలకు ఒక కుమార్తె, కుమారుడు. మల్లేష్‌ కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె సుమిత్ర అలియాస్‌ శిరీషకు రెండున్నర సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో శివకుమార్‌ ఆదివారం పురుగుల మందు తాగాడు. వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తన కారణంగానే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించిన సుమిత్ర మనస్తాపంతో మంగళవారం రాత్రి హైతాబాద్‌లోని తల్లిగారి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. బుధవారం ఉదయం కుమార్తె మృతి చెందడాన్ని గమనించిన తల్లి యాదమ్మ(45) తన కుమార్తె జీవితం ఇలా అయ్యిందే అన్న బాధ]తో ఇంటి ముందు ఉన్న సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పురుగుల మందు తాగిన మల్లేష్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని