Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్‌ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం

డేటా చోరీ కేసులో హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని ల్యాప్‌ టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వివరాలు ఉన్నట్టు గుర్తించారు.

Updated : 01 Apr 2023 17:18 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరింత లోతుగా శోధిస్తోంది. డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను నిందితుడు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

inspirewebz వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా తస్కరించిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ప్లిక్స్ యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి ,బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్‌ సిటీల నుంచి వినయ్‌ భరద్వాజ డేటా చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని