logo

ఒక్కో ప్లాట్‌ఫాంపై రెండు రైళ్లు

నిజాంకాలం నాటి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారే రోజు ఆసన్నమైంది. ఇరుకుస్టేషన్లో.. అరకొర సౌకర్యాలతో సతమతమయ్యే పరిస్థితులకు తెరపడనుంది.

Updated : 02 Apr 2023 08:43 IST

సిటీ బస్సులు, మెట్రో  చేరుకునేందుకు ప్రత్యేక ర్యాంపులు
2025 నాటికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పూర్తి
‘ఈనాడు’ ముఖాముఖీలో డీఆర్‌ఎం ఏకే గుప్తా
- ఈనాడు-హైదరాబాద్‌

నిజాంకాలం నాటి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారే రోజు ఆసన్నమైంది. ఇరుకుస్టేషన్లో.. అరకొర సౌకర్యాలతో సతమతమయ్యే పరిస్థితులకు తెరపడనుంది. రూ.700 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణానికి పునాదిరాయి పడనుంది. ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేషన్‌ ఆవరణలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్టేషన్‌ పునర్నిర్మాణం చేస్తామని సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నచోట ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేతలైనా.. నిర్మాణాలైనా చేపడతామంటున్న ఏకే గుప్తాతో ‘ఈనాడు’ ముఖాముఖీ.. 

పనులు ఎప్పటి నుంచి ఊపందుకోనున్నాయి?

డీఆర్‌ఎం: అత్యంత రద్దీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 149 ఏళ్ల నుంచి నగర ప్రయాణికులకు సేవలందిస్తోంది. రూ.700 కోట్ల పైచిలుకు మొత్తంతో స్టేషన్‌ను మొత్తం పునర్నిర్మిస్తున్నాం. శంకుస్థాపన తర్వాత పూర్తి స్థాయిలో పనులు వేగాన్ని అందుకుంటాయి.

పునర్నిర్మాణ వేళ ప్రయాణికులు, రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా?

డీఆర్‌ఎం: 208 ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్‌ రైళ్లు 60 ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగించడం ద్వారా రోజూ 1.48 లక్షల మంది  ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే టికెట్‌ కౌంటర్లతోపాటు రైల్వేరక్షణ దళ కార్యాలయాలకు బదులు ప్రత్యామ్నాయంగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు కొత్త భవనం నిర్మిస్తున్నాం. ప్లాట్‌ఫామ్‌ 10 వైపు మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ భవనాన్ని నిర్మిస్తున్నాం. ఇందులోనే ప్రయాణికులకు వసతి కూడా కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలన్నిటికీ ప్రత్యామ్నాయం చూపించాకే స్టేషన్లో కూల్చివేతలు  చేపడతాం.

ప్లాట్‌ఫాంలు సరిపోక ఇప్పటికే నగర శివార్లలో రైళ్లు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఇబ్బందులుండవా?

డీఆర్‌ఎం: రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేషన్‌ను నిర్మిస్తున్నాం. ప్లాట్‌ఫాంలపైన మొత్తం డోం వస్తుంది. ప్లాట్‌ఫాంల నిడివి పెంచడం ద్వారా ఎక్కువ రైళ్లను స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో ప్లాట్‌ఫాం మీద రెండు రైళ్లు ఆపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పటి వరకూ చర్లపల్లి, లింగంపల్లితోపాటు నగర శివార్లలో ఉన్న రైల్వేస్టేషన్లను వినియోగించుకుంటాం.

కొత్తగా ఎలాంటి సౌకర్యాలు సమకూరనున్నాయి. ఎప్పటిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

డీఆర్‌ఎం: పునర్నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్టేషన్‌ రూపురేఖలు మొత్తం మారిపోనున్నాయి. స్టేషన్‌ నుంచే నేరుగా ప్రయాణికులు ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు చేరుకునేలా ర్యాంపులు వస్తాయి. బహుళ అంతస్తుల భవనాలు రానున్నాయి. వీటి ద్వారా రూఫ్‌టాప్‌ ప్లాజాలు, రెస్టారెంట్లు, కేఫ్‌టేరియాలు, వ్యాపార సముదాయాలు అందుబాటులోకి వస్తాయి. వీటిద్వారా స్థానికులకు మంచి వ్యాపార అవకాశాలు కూడా లభించనున్నాయి. రైళ్లు ఎక్కేవారు, దిగేవారు ఒకవైపే ప్రయాణించకుండా.. వేర్వేరు మార్గాలతో సులభతరం చేస్తాం.  

అధునాతన సౌకర్యాలు తెలిపే నమూనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని