logo

అహర్నిశలు శ్రమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం

‘తూ... మేరీ జిందగీ హై.., దిల్‌ హై కె మాన్‌తా నహీ.., చాహా హై తుమే చాహెంగే’ పాటలు యువ హృదయాలను గిలిగింతలు పెట్టడమే కాకుండా.. ‘సాయి దివ్య రూపం.., ‘ఓం జై గంగేమాతా.. శ్రీ గంగేమాత’, జై దుర్గే కప్పర్‌వాలీ’ వంటి భక్తిగీతాలతో ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు బాలీవుడ్‌ గాయని అనురాధ పౌడ్వాల్‌.

Updated : 02 Apr 2023 05:19 IST

గాయని అనురాధ పౌడ్వాల్‌
 -న్యూస్‌టుడే, నారాయణగూడ

‘తూ... మేరీ జిందగీ హై.., దిల్‌ హై కె మాన్‌తా నహీ.., చాహా హై తుమే చాహెంగే’ పాటలు యువ హృదయాలను గిలిగింతలు పెట్టడమే కాకుండా.. ‘సాయి దివ్య రూపం.., ‘ఓం జై గంగేమాతా.. శ్రీ గంగేమాత’, జై దుర్గే కప్పర్‌వాలీ’ వంటి భక్తిగీతాలతో ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు బాలీవుడ్‌ గాయని అనురాధ పౌడ్వాల్‌. తన గాత్రంతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న ఆమెను ఇటీవల నగరంలో శ్రుతి లయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌ వెల్‌ కార్పొరేషన్‌, తిరుమల బ్యాంక్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఇండియన్‌ ప్రైడ్‌ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేటి తరం మూలాలను మరచిపోకుండా సంగీత సాధన చేయాలన్నారు. అహర్నిశలు శ్రమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. తనను హైదరాబాద్‌ పిలిచి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.   

 ‘ఆది శంకరాచార్య’ త్వరలో పూర్తి

‘సినిమాల్లో పాడుతూనే.. ఎక్కువగా ఆధ్యాత్మిక గీతాలపై దృష్టి సారిస్తున్నా. ఇటీవల అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త ‘ఆది శంకరాచార్య’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా.’ అని తెలిపారు. పాన్‌ ఇండియా అనేది ఇప్పటి మాటని, తాను ఆలపించిన ఆధ్యాత్మిక, భక్తిగీతాలను విశ్వవ్యాప్తంగా సంగీతాభిమానులు ఆదరించారని తెలిపారు. ఈతరం పిల్లలు మంచి గురువుల వద్ద శిక్షణ తీసుకొని, తమ గొంతులను పలికిస్తున్నారన్నారు. పాటల్లో ఆధునిక పోడకలు ఆహ్వానించాల్సిందేనన్నారు. ఆధ్యాత్మికతలో ‘ఫ్యూజన్‌’ తాను వినలేదని, సంప్రదాయ పద్ధతిలోనే భక్తిగీతాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగులో పలు భక్తి, సినీ గీతాలను ఆలపించే అవకాశం వచ్చిందని, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అదృష్టం కలిగిందన్నారు. ఎస్‌.జానకి, పి.సుశీల, చిత్ర పాటలకు తాను అభిమానిని అని పేర్కొన్నారు.

సామాజిక సేవలో.. సర్వప్రాణి సేవను మాధవ సేవగా తాను నమ్ముతానని, అందుకే ‘సూర్యోదయ ఫౌండేషన్‌’ను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. వినికిడి లోపం, బధిరులకు చేయూత ఇస్తూ, అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. పది గ్రామాలను దత్తతకు తీసుకొని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ పిల్లల కోసం ఫౌండేషన్‌ పని చేస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు